వేములపల్లి, ఆగస్టు 29 : ఈ సారి వానకాలంలో సరైన వర్షాలు కురువక పోవడంతో సాగునీటి ప్రాజెక్టుల్లోకి నీరు చేరలేదు. అయినా మండలంలోని 90 శాతం చెరువుల్లో నేటికీ పుష్కలంగా నీరుండడంతో ఆయా గ్రామాల్లో భూగర్భ జలాలు సంవృద్ధిగా లభిస్తున్నాయి. దాంతో బోర్లకింద రైతులు దర్జాగా సాగు చేసుకుంటున్నారు. తెలంగాణ ఏర్పాటయ్యాక సీఎం కేసీఆర్ మిషన్ కాకతీయ పథకం కింద చెరువుల్లోని పూడికను తొలగించి కట్టలను బలోపేతం చేశారు. దాంతో చెరువుల్లో సంవృద్ధిగా నీరు చేరింది.
ప్రస్తుతం వానకాలం అయినప్పటికీ వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. దానికి తోడు ఎండలు సైతం మండుతున్నాయి. ఇలాంటి ప్రతికూల వాతావరణంలోనూ మండలంలోని పలు చెరువులు నిండుకుండను తలపిస్తున్నాయి. సమైక్య రాష్ట్రంలో నీళ్లు లేక బీటలు వారిన మండలంలోని వేములపల్లి నియమితఖాన్ చెరువు, ఊర చెరువు, ఆమనగల్లు, రావులపెంట, కామేపల్లి, శెట్టిపాలెం చెరువులు సైతం నీటితో కళకళలాడుతున్నాయి. దాంతో ఆయా గ్రామాల్లో భూగర్భ జలం కూడా పుష్కలంగా ఉండడంతో తాగు, సాగు నీటి ఇబ్బందులు తొలిగాయి. రైతుల బోర్లల్లో కూడా సంవృద్ధిగా నీరు ఉండడంతో వాటి కిందనే వానకాలం సాగును చేపట్టారు. ప్రస్తుతం కృష్ణానది ఎగువ ప్రాంతాల్లో సైతం వర్షాలు కురియక పోవడంతో నాగార్జునసాగర్ ప్రాజెక్టులో నీరు చేరలేదు. సాగర్ ఎడమ కాల్వ నీటి విడుదల లేక పోయినప్పటికీ బోర్లు, బావుల కింద వానకాలం సాగు చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం సైతం నిరంతర విద్యుత్ అందిస్తుండడంతో సాగునీటికి ఇబ్బందులు లేవని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
సమైక్య రాష్ట్రంలో నిరాదరణకు గురైన చెరువులను తెలంగాణ ప్రభుత్వం మిషన్ కాకతీయతో అభివృద్ధి చేసింది. మండలంలోని పలు చెరువులను మిషన్ కాకతీయ పథకం మొదటి విడుతలో పది చెరువులకు ఒక్కో చెరువుకు రూ.1.61 లక్షలు కేటాయించి అభివృద్ధి చేసింది. రెండో దశలోనూ 13 చెరువులను సుమారు రూ. 12కోట్లతో అభివృద్ధి చేశారు. చెరువుల్లోని పూడిక తొలగించడం, చెరువుకట్టల, తూముల మరమ్మతు పనులు వంటివి చేపట్టారు. దాంతో పాటు సాగర్ ఎడమ కాల్వ, మూసీ కాల్వల ద్వారా చెరువులను పూర్తిస్థాయిలో నింపారు. ఫలితంగా చెరువుల్లో నీటి నిల్వలు పెరిగి తాగు, సాగు నీటి ఇబ్బందులు తొలగాయి. పలు చెరువుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా చేప పిల్లలను విడుదల చేయడంతో మత్స్యకారులకు సైతం ఆదాయం లభిస్తున్నది.
వర్షాకాలం మొదలై మూడు నెలలైనా సరైన వర్షాలు పడలేదు. సీఎం కేసీఆర్ మిషన్ కాకతీయతో చెరువులను అభివృద్ధి చేయడంతో ఇప్పుడు కూడా చెరువుల్లో పుష్కలంగా నీళ్లున్నాయి. దాంతో బోర్లు కూడా బాగా పోస్తున్నాయి. మా ఊర్లో భూగర్భ జలాలు పెరగడంతో బోరు బావుల కింద వరి నాట్లు వేశాం. మా ఊళ్ల మత్స్యకారులు సంఘంగా ఏర్పడి ప్రభుత్వ ప్రోత్సాహంతో చెరువుల్లో చేపలను పెంచుతూ స్వయం ఉపాధి పొందుతున్నారు.
-వల్లమల్ల బాలయ్య, మొల్కపట్నం