ఉమ్మడి పాలనలో అప్పటి ప్రభుత్వం ‘అభయహస్తం’ పథకం రూపకల్పన చేసింది. స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా ఉండి 50 ఏళ్ల వయస్సు ఉన్నవారికి ఈ పథకాన్ని వర్తింపజేసింది. లబ్ధిదారులు తమ వాటా ధనంగా రూ.30 చెల్లిస్తే ప్రతినెలా రూ.500 పింఛన్ మంజూరు చేసేది. అయితే, తెలంగాణ ఏర్పడిన తర్వాత ఈ పథకం లబ్ధిదారులకు పింఛన్ నిలిపివేసింది. ఐదేళ్లపాటు నెలనెలా రూ.30 చొప్పున చెల్లించారు. ఈ సమస్యను పరిష్కరించాలని వారు పలుమార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దీంతో స్పందించిన సీఎం కేసీఆర్ లబ్ధిదారులకు తిరిగి ప్రీమియం చెల్లించనున్నట్లు ప్రకటించడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది.
ఖమ్మం, మార్చి 21 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/కొత్తగూడెం అర్బన్ : అభయహస్తం లబ్ధిదారులకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఉమ్మడి పాలనలో అప్ప టి స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా ఉండి 50 ఏళ్ల వయస్సు కలిగినవారికి నాటి ప్రభుత్వం ‘అభయహస్తం’ పథకాన్ని వర్తింపజేసింది. దీంతో ‘కో-కాంట్రిబ్యూటరీ పెన్షన్ యాక్ట్ -2009’లో పింఛను పొందేందుకు ఏడాదికి ఒకసారి ప్రీమియం చెల్లించారు. లబ్ధిదారులు తమ వాటా ధనంగా రూ.30లను చెల్లిస్తే వారికి ప్రతినెలా రూ.500 పింఛన్ మంజూరు చేసేది. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఈ పథకాన్ని నిలిపివేసింది. అయితే, లబ్ధిదారులకు ఆసరా పింఛన్ అందుతున్న నేపథ్యంలో గ్రూప్ సభ్యులు గతంలో చెల్లించిన ప్రీమియాన్ని తిరిగి వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని కొన్నేళ్ల నుంచి ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
స్వయం సహాయక సంఘాల పరిధిలోని సభ్యులు ఒక్కొక్కరూ ఏడాదికి రూ.365 ప్రీమియం చెల్లిస్తే వారికి 60 సంవత్సరాలు నిండిన తర్వాత ఒక్కొక్కరికీ నెలకు రూ.500 చొప్పున పింఛన్ ఇచ్చేలా పథకానికి రూపకల్పన చేసింది. సుమారు తొమ్మిదేళ్ల పాటు ప్రభుత్వం నిర్దేశించిన ప్రీమియాన్ని అప్పటి నుంచి గ్రూప్ సభ్యులు చెల్లిస్తూ వస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత 61 ఏళ్లు నిండిన ప్రతిఒక్కరికీ ‘ఆసరా’ పింఛన్ పంపిణీ మొదలైంది. ప్రభుత్వం ఒక్కో పింఛనుదారుకు నెలకు రూ.2,016 చొప్పున పింఛను అందిస్తున్నది. పింఛను తీసుకుంటున్న వారిలో స్వయం సహాయక సంఘాల సభ్యులూ ఉన్నారు. దీంతో గ్రూప్ సభ్యులు అభయహస్తం పథకంపై విముఖత చూపించారు. అప్పటి నుంచి వేలాది మంది ఏటా ప్రీమియం చెల్లించకుండా ఆగిపోయారు. గ్రూప్ సభ్యులు చెల్లించిన ప్రీమియాన్ని తిరిగి ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. సమస్యను అర్థం చేసుకున్న తెలంగాణ ప్రభుత్వం గ్రూప్ సభ్యులు చెల్లించిన ప్రీమియాన్ని తిరిగి ఇచ్చేందుకు అంగీకరించింది. నేరుగా గ్రూప్ సభ్యుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.
భద్రాద్రి జిల్లావ్యాప్తంగా సుమారు 78 వేల మందికిపైగా ప్రీమియం చెల్లించారు. సెర్ప్ అధికారులు ఇప్పటికే మండలాల వారీగా ప్రీమియం చెల్లించినవారి వివరాలను సేకరించారు. కొత్తగూడెంలో 1,739 మంది, పాల్వంచలో 3,117 మంది, మణుగూరులో 1,501 మంది, ఇల్లెందులో 1,861 మంది ప్రీమియం చెల్లించారు. ఇలా మున్సిపాలిటీలతోపాటు మండల పరిధిలోనూ వేలాది మంది చెల్లించారు. ప్రీమియం చెల్లించిన తొమ్మిదేళ్ల తర్వాత తిరిగి ఎవరి నగదు వారికి తిరిగి వస్తుండడంతో గ్రూప్ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఖమ్మం జిల్లాలో 1,36,656 మంది ‘అభయహస్తం’ లబ్ధిదారులు ఉన్నారు. ఎస్సీలు 38,219, ఎస్టీలు 22,912, బీసీలు 60,560, ఓసీలు12,734, మైనార్టీలు 2,231 మంది ఉన్నారని అధికారుల లెక్కలు చెబుతున్నాయి. వీరిలో కొంతమంది మరణించగా.. మరికొందరు ఆసరా పెన్షన్ పొందతున్నారు. ఇంకొందరు ఆసరా పింఛన్కు అర్హత పొందారు. లబ్ధిదారులకు వారివాటా సొమ్మును చెల్లించేందుకు మార్గదర్శకాలు జారీ చేసిన వెంటనే సెర్ప్ సిబ్బంది వారి ఖాతాల్లో నగదు జమ చేయనున్నారు.
‘అభయహస్తం’ప్రీమియాన్ని ప్రభుత్వం తిరిగి చెల్లించేందుకు అంగీకరించింది. జిల్లాలో మండలాల వారీగా ప్రీమియం చెల్లించిన సభ్యులు, బ్యాంకు ఖాతా వివరాలను సేకరించాం. ప్రభుత్వం నుంచి అనుమతులు రాగానే సభ్యుల బ్యాంక్ ఖాతాల్లో నేరుగా నగదు జమ చేస్తాం. జమ చేయడంలో ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా చర్యలు తీసుకుంటాం.
-నీలేశ్, సెర్ప్ అదనపు పీడీ, కొత్తగూడెం