నర్సాపూర్ : అతను ఓ అమ్మాయిని గాఢంగా ప్రేమించాడు. ప్రేమ విఫలం కావడంతో గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పపడ్డాడు. కుటుంబ సభ్యులు హాస్పిటల్లో చేర్పించగా చికిత్స పొందుతూ ఓ యువకుడు మృతి చెందిన విషాదకర సంఘటన మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో చోటు చేసుకుంది. ఎస్ఐ రంజిత్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం నర్సాపూర్ పట్టణం శివాలయం వీధికి చెందిన ఇల్లెపు నవీన్(22) కూలి పని చేసుకుంటూ జీవిస్తున్నాడు. నర్సాపూర్కే చెందిన ఓ అమ్మాయిని నవీన్ గత కొన్ని రోజులుగా ప్రేమిస్తున్నాడు. ఈ ప్రేమ కాస్త విఫలం కావడంతో మనస్థాపానికి గురయ్యాడు. ప్రేమ విఫలం కావడంతో జీవితంపై విరక్తి చెంది జనవరి 18వ తేదీన గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు.
ఈ విషయం గమనించిన కుటుంబ సభ్యులు నవీన్ ను నర్సాపూర్ లోని ప్రభుత్వ దవఖానకు తరలించి చికిత్స అందించి మెరుగైన చికిత్స నిమిత్తం జనవరి 21న సికింద్రాబాద్ లోని గాంధీ దవాఖానలో అడ్మిట్ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం నవీన్ మృతి చెందాడు. తన తమ్ముడు ప్రేమ విఫలం కావడంతోనే గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడి అన్న శ్రీహరి పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశాడు.