దుబ్బాక, మే 3: అప్పుల బాధతో ఓ రైస్మిల్లు వ్యాపారి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్ పరిధిలోని లచ్చపేటలో శుక్రవారం జరిగింది. మృతుడి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. లచ్చపేటకు చెందిన కాచం నాగార్జున (55) స్థానికంగానే సుమారు 20 ఏండ్ల కిందట మహేశ్వర రైసుమిల్లు ఏర్పాటు చేశాడు. అదే గ్రామానికి చెందిన తడకమడ్ల విశ్వం, అతడి బంధువులతోపాటు కాచం నాగార్జున భాగస్వామిగా ఉంటూ నడిపిస్తున్నారు.
విశ్వంకు నాగార్జున సుమారు రూ.8 కోట్లు అప్పుగా ఇచ్చాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో విశ్వం ఆర్థికంగా నష్టపోయాడు. ఆ తరువాత అనారోగ్యానికి గురైన విశ్వం 10 నెలల కిందట మరణించాడు. విశ్వంకు ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాలని నాగార్జునను అతడి బంధువులు, స్నేహితులు ఒత్తిడి చేశారు. తనకు రూ.8 కోట్లు ఇవ్వాలని విశ్వం కుటుంబ సభ్యులను నాగార్జున పలుమార్లు కోరగా వారు పట్టించుకోలేదు. దీంతో మానసికంగా కలత చెందిన నాగార్జున శుక్రవారం మధ్యాహ్నం రైస్మిల్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. తన తండ్రి ఆత్మహత్యకు కారణమైన తడకమడ్ల గణేశ్, విశ్వం కుమారుడు నీరజ్లపై చర్యలు తీసుకోవాలని కోరుతూ నాగార్జున కుమారుడు మణికంఠ దుబ్బాక పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశాడు.