తమ జీవితాలకు ధీమా లేదని భావించి, కష్టార్జితంలో ఎంతోకొంత భాగం ఎల్ఐసీలాంటి బీమా కంపెనీల్లో ప్రీమియంలు కడుతూ, ఎస్బీఐ లాంటి జాతీయ బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లు పెడుతూ భరోసాగా బతుకీడుస్తున్న కోట్ల మంది ప్రజల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. అదానీ గ్రూప్ నిర్వాకం వెలుగులోకి రావడంతో పొదుపరులు, మదుపరులు భయాందోళనలకు గురవుతున్నారు. మనుగడ ప్రశ్నార్థకమై, మునుగుడు తప్పదేమోనని బెంబేలెత్తుతున్నారు. ప్రజాధనం ప్రమాదంలో ఉన్నదని, అదానీ గ్రూప్లో అత్యధిక వాటా ప్రభుత్వ బ్యాంకులదేనని అంతర్జాతీయ ఇన్వెస్ట్మెంట్ సంస్థ సీఎల్ఎస్ఏ ప్రకటించడం సంచలనం రేపుతున్నది. రిజర్వ్ బ్యాంక్, సెబీ రంగంలోకి దిగాయి. అదానీ గ్రూపునకు ఇచ్చిన రుణాల వివరాలివ్వాలని బ్యాంకులను ఆర్బీఐ ఆదేశించింది. మరోవైపు అదానీ గ్రూప్ షేర్ల పతనం కొనసాగుతున్నది. 6 రోజుల్లో అదానీ గ్రూప్ షేర్లు ఏకంగా 8.76 లక్షల కోట్లు నష్టపోయాయి.
(స్పెషల్ టాస్క్ బ్యూరో)
హైదరాబాద్, ఫిబ్రవరి 2 (నమస్తే తెలంగాణ): దేశంలో కోట్లమంది సామాన్యుల సొమ్ము కర్పూరంలా కరిగిపోతున్నది. జీవిత బీమాకు ధీమానిచ్చిన ప్రభుత్వరంగ బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ)కే బీమా చేయించే పరిస్థితి దాపురించింది. అదానీ కంపెనీల్లో అడ్డగోలుగా పెట్టుబడులు పెట్టి చేతులు కాల్చుకొంటున్న ఎల్ఐసీ సంపద వారం రోజుల్లోనే మొత్తం పెట్టుబడుల్లో రూ.40 వేల కోట్ల వరకు హరించుకుపోయినట్టు వార్తలు వస్తున్నాయి. అదానీ గ్రూప్ కంపెనీల్లో ఈ నెల 24 నాటికి ఎల్ఐసీ పెట్టుబడుల విలువ రూ.81,268 కోట్లు ఉండగా, ప్రస్తుతం ఇందులో 50 శాతం వరకు సంపద కోల్పోయినట్టు సమాచారం. మరోవైపు, అదానీ గ్రూప్లోని టాప్-5 కంపెనీలకు రుణాలిచ్చిన బ్యాంకుల పరిస్థితి మరింత అగమ్యగోచరంగా తయారైంది. ఈ మేరకు హాంకాంగ్ కేంద్రంగా పనిచేస్తున్న అంతర్జాతీయ ఇన్వెస్ట్మెంట్ సంస్థ సీఎల్ఎస్ఏ (క్రెడిట్ ల్యోనాయిస్ సెక్యూరిటీస్ ఏషియా) ఒక నివేదికలో వెల్లడించింది.
దాస్కున్న పైసలు ఏమైతయో?
అదానీ గ్రూప్నకు చెందిన టాప్-5 గ్రూప్ కంపెనీల అప్పులు రూ.2.1 లక్షల కోట్లుగా ఉన్నట్టు అంతర్జాతీయ ఇన్వెస్ట్మెంట్ సంస్థ సీఎల్ఎస్ఏ ఒక నివేదికలో వెల్లడించింది. ఇందులో దేశీయ బ్యాంక్ల నుంచి రూ.81,234 కోట్లు (38 శాతం) సమీకరించినట్టు తెలిపింది. బాండ్లు/వాణిజ్యపత్రాలు జారీచేయడం ద్వారా 37 శాతం రుణాలు, ఆర్థిక సంస్థల నుంచి 11 శాతం రుణాలు, 12-13 శాతం రుణాలను గ్రూప్ కంపెనీల మధ్య పరస్పర వినిమయం ద్వారా అదానీ గ్రూప్ అప్పు చేసినట్టు వెల్లడించింది. మొత్తం రుణాల్లో సింహభాగం (38 శాతం) బ్యాంకుల నుంచే చేకూరినట్టు తేల్చిచెప్పింది. బ్యాంకులు ఇచ్చిన మొత్తం రుణాల్లో 90 శాతం అప్పులను ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచే అదానీ గ్రూప్ తీసుకొన్నట్టు వెల్లడించింది.
అదానీ గ్రూప్నకు ఎస్బీఐ రకరకాల రూపాల్లో ఇచ్చిన రుణాలు రూ.50,000 కోట్లపైనే ఉంటాయని పరిశ్రమ నిపుణులు చెపుతున్నారు. అయితే సాధారణ రుణాలు కాకుండా, ప్రభుత్వ రంగ బ్యాంక్లు అదానీ గ్రూప్నకు అందించిన ఇతర ఆర్థిక సహకారాల సమాచారం (గ్యారంటీలు, అండర్రైటింగ్, ఇన్వాయిస్ల డిస్కౌంటింగ్) తమ వద్ద లేదని సీఎల్ఎస్ఏ ప్రకటించింది. కాగా, ఎల్ఐసీ వంటి బీమా సంస్థల్లో, ఎస్బీఐ వంటి ప్రభుత్వరంగ బ్యాంకుల్లో జీవిత బీమా ప్రీమియంలు, ఫిక్స్డ్ డిపాజిట్ల రూపంలో దేశంలోని కోట్లాది మంది పౌరులు డబ్బులను దాచుకొంటున్నారు. ఇప్పుడు ఈ సంస్థలు ఆ సొమ్మునంతా అదానీ గ్రూప్ కంపెనీలకు మళ్లించి.. చేతులు కాల్చుకొంటుండటంతో తమ పైసలు ఏమవుతాయోనని సామాన్యులు ఆందోళనకు గురవుతున్నారు.