జగిత్యాల : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన అయోధ్య రామాలయం విరాళాల( Ayodhya donations ) చోరీపై సిట్తో పాటు సుప్రీంకోర్టు చోరవ తీసుకుని జ్యుడీషియల్ విచారణ చేపట్టాలని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్ రెడ్డి( Chada Venkat Reddy ) దేశ ప్రధాని మోదిని డిమాండ్ చేశారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని తాజా చికెన్ బ్యాంకెట్ హాల్లో శనివారం భారత కమ్యూనిస్టు పార్టీ జిల్లా కౌన్సిల్, శాఖ కార్యదర్శుల సమావేశాన్ని నిర్వహించారు.
అనంతరం విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. అయోధ్య రామాలయానికి వచ్చే భక్తులు హుండీల్లో, విరాళాల పెట్టెల్లో వేసే నగదు , బంగారము దోపిడీకి పాల్పడడం చూస్తుంటే ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ ఏమి చేస్తుందని మండిపడ్డారు. చోరీ విషయంలో ఆలయ ట్రస్టుతో పాటు అధికారులు, నిఘా విభాగం సిబ్బంది నిర్లక్ష్యమే కారణమన్నారు. ఈ ఘటనపై సీట్ విచారణ , సరిపోదని సుప్రీంకోర్టు చొరవ తీసుకుని జ్యుడీషియల్ విచారణ చేపడితేనే అన్ని నిజాలు బయటకు వస్తాయన్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోడి తక్షణమే స్పందించాలని కోట్లాది మంది రామ భక్తుల నమ్మకాన్ని నిలబెట్టాలన్నారు.
ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమం అనేది అనేక నిబంధనలతో కూడుకున్నదని ఈ విషయంలో బూత్ లెవల్ అధికారులు ఓటర్లకు సరైన అవగాహన కల్పించడం లేదన్నారు. రానున్న రోజుల్లో బీజేపీ అధికారంలోకి రావడం కోసం తన వ్యతిరేక ఓట్లను తొలగించేందుకే ఈ సర్ విధానాన్ని అమలులోకి తీసుకువచ్చిందని ఆరోపించారు. దొంగ ఓట్ల పేరుతో ఉన్న ఓట్లు తొలగిస్తే ఊరుకోమని సీపీఐ ఆధ్వర్యంలో ఉద్యమిస్తానని హెచ్చరించారు.
సమాన పనికి సమాన వేతనాలు ఇవ్వక పోవడంతో పాటు సంక్షేమ బోర్డును కూడా అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై సీపీఐ నిరంతరం పోరాటం చేస్తుందన్నారు. ఆగస్టు 8 నుంచి 14 వ తేదీ వరకు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో పాద యాత్రలు చేపట్టి బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడతామన్నారు. సెప్టెంబర్ ఒకటిన దేశ రాజధాని ఢిల్లీలో నిరసన ర్యాలీ చేపట్టి మోదీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరిస్తామన్నారు. ఈ సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి చెన్న విశ్వనాధం, జిల్లా ఇన్కచార్జి బోయిని అశోక్, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ వెన్న సురేష్, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సుతారిరాములు,ముకరం, జగిత్యాల నియోజకవర్గ కార్యదర్శి వెన్న మహేష్, నాయకులు మునుగూరి హన్మంతు, రాధ, పద్మ, శాంత, మానస, శిరీష తదితరులు ఉన్నారు.