Asteroid | న్యూఢిల్లీ, సెప్టెంబర్ 14: మానవాళిని ఓ భారీ గ్రహ శకలం (ఆస్టరాయిడ్) భయపెడుతున్నది. ఆకాశ హర్మ్యం అంత పరిమాణంలో ఉన్న ఈ గ్రహశకలం ఈ నెల 17న భూగోళాన్ని దాటుకుని వెళ్తుందని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’ ప్రకటించింది. 721 నుంచి 1,575 అడుగుల (220-480 మీటర్ల) చుట్టుకొలతతో ఉన్న ఈ గ్రహశకలానికి ‘2024 ఆన్’ అని నామకరణం చేశారు. ప్రస్తుతం ఈ ఆస్టరాయిడ్ గంటకు 19,842 మైళ్ల (31,933 కి.మీ.) వేగంతో ప్రయాణిస్తున్నదని, ఇది ధ్వని వేగం కంటే 26 రెట్లు అధికమని ‘లైవ్ సైన్స్’ వెల్లడించింది.
ఈ గ్రహ శకలం భూగోళానికి దాదాపు 62 వేల మైళ్ల (లక్ష కిలోమీటర్ల) చేరువగా రానున్నది. ఇది భూమికి, చంద్రునికి మధ్య ఉన్న సగటు దూరం కంటే 2.6 రెట్లు ఎక్కువ. ఈ ఆస్టరాయిడ్ భూమిని ఢీ కొనబోదని, మానవాళి భద్రతకు ఎలాంటి ముప్పు కలిగించబోదని శాస్త్రవేత్తలు తెలిపారు. నాసా నిర్దేశించిన ప్రమాణాల ప్రకారం భూగోళానికి 12 కోట్ల మైళ్ల (19.3 కోట్ల కిలోమీటర్ల) చేరువగా వచ్చిన ఖగోళ వస్తువులను భూమికి సమీపంగా వచ్చిన వస్తువులుగా, 46.5 లక్షల మైళ్ల (75 లక్షల కిలోమీటర్ల) చేరువగా వచ్చే పెద్ద వస్తువులను ప్రమాదకరమైనవిగా పరిగణిస్తారు.