వర్ష ఖరే.. అహ్మదాబాద్ నివాసి. అందరిలాంటి అమ్మాయే. అమ్మంటే ప్రాణం. నాన్నంటే ఇష్టం. కానీ, వర్షను కూతురిగా ఆమోదించడానికి నాన్న ఇష్టపడ లేదు. ‘ఆయన మా అమ్మ గీతతో సహజీవనం చేశారు. పెద్దల ఒత్తిడి కారణంగా ఆ దాంపత్య బంధాన్ని వదులుకుని వెళ్లిపోయారు. ఇంకో పెళ్లి చేసుకున్నారు. అమ్మానాన్నల ప్రేమకు సాక్ష్యం నేనే. నాలో ప్రవహించేది ఆయన రక్తమే’ అంటూ.. వర్ష కన్నీళ్లు పెట్టుకున్న సందర్భాలు అనేకం. కానీ సమాజం తనను తండ్రి ఎవరో తెలియని ఆడపిల్లగానే చూసింది. ఎగతాళి చేసింది. కొందరు వెనుక నుంచి గుసగుసగా మాట్లాడుకున్నారు. దీంతో వర్ష న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.
తనను శివాజీరావ్ జోంధాలే కన్న కూతురిగా ప్రకటించాలంటూ న్యాయమూర్తులకు విన్నవించుకుంది. దీంతో కోర్టు డీఎన్ఏ పరీక్షలకు ఆదేశించింది. ఆ నివేదిక ఆధారంగా వర్షను శివాజీరావ్ కూతురిగా నిర్ధారించింది. ‘ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందన్న కారణంతో తండ్రిగా మీ బాధ్యత నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశారు మీరు’ అంటూ శివాజీపై అక్షింతలు చల్లింది కోర్టు. ‘నేను గెలిచాను. అమ్మను గెలిపించాను. చాలా ఆనందంగా ఉంది’ అంటున్నప్పుడు వర్ష కళ్లు ఆనందంతో వర్షించాయి.