రాజన్నసిరిసిల్ల/ హైదరాబాద్, జనవరి 31 (నమస్తే తెలంగాణ)/కోనరావుపేట: తోటి పిల్లలతో కలిసి ఆడుకొనే వయసు ఆ చిన్నారిది.. కానీ, ప్రకృతిపై ప్రేమతో గొప్ప కార్యక్రమాన్ని చేపట్టింది. తండ్రి బాటలో, ఆయన స్ఫూర్తితో నాలుగేండ్లలో 65 వేల సీడ్ బాల్స్ తయారు చేసింది. ఆమే.. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం సుద్దాలకు చెందిన ప్రకృతి ప్రకాశ్ కూతురు బ్లెస్సీ. పర్యావరణంపై ఆమె ప్రేమకు ముచ్చటపడిన మంత్రి కేటీఆర్, ఎంపీ సంతోష్కుమార్ ఆమెకు బ్లెస్సింగ్స్ అందజేశారు.
గతంలో ట్విట్టర్ వేదికగా అభినందించిన మంత్రి, ఎంపీ.. సోమవారం ఆమె పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్కు పిలిపించుకొని జీవితంలో గుర్తుండిపోయే జ్ఞాపకాలను అందించారు. ముందుగా హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లో ఉన్న జీహెచ్ఎంసీ పార్కులో గ్రీన్ ఇండియా చాలెంజ్ సృష్టికర్త, ఎంపీ సంతోష్కుమార్తో కలిసి మొక్కలు నాటింది. తానే స్వయంగా తయారుచేసిన సీడ్ బాల్స్ని ఎంపీ సంతోష్కు అందజేసింది. ఈ కార్యక్రమ అనంతరం మంత్రి కేటీఆర్ వద్దకు ఎంపీ సంతోష్కుమార్ స్వయంగా తీసుకెళ్లారు. చిన్నతనం నుంచే ప్రకృతి పట్ల ప్రేమను నింపిన బ్లెస్సీ తల్లిదండ్రులను కేటీఆర్ ప్రత్యేకంగా అభినందించారు.
చిన్నారి బ్లెస్సీకి చార్మినార్ చిత్రంతో కూడిన జ్ఞాపికను అందజేశారు. ఏ అవసరమొచ్చినా అండగా ఉంటామని భరోసానిచ్చారు. ఎంపీ సంతోష్కుమార్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ మానస పుత్రిక హరితహారం, గ్రీన్ ఇండియా చాలెంజ్ స్ఫూర్తితో చేపట్టిన కార్యక్రమాలు భావితరాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయని అన్నారు. సీఎం కేసీఆర్ స్ఫూర్తితోనే బ్లెస్సీతో సీడ్ బాల్స్ తయారు చేయించామని ఆమె తండ్రి ప్రకాశ్ తెలిపారు. గ్రీన్ ఇండియా చాలెంజ్లో పాల్గొని మొక్కలు నాటడం గొప్పవరంలా భావిస్తున్నామని పేర్కొన్నారు.