హైదరాబాద్ : ప్రమాదవశాత్తు చిన్నారిపై ఇనుప స్టూల్(Iron stool) పడి మృతి(Child died) చెందిన ఘటన హనుమకొండ జిల్లా కాజీపేటలో(Kazipet) బుధవారం చోటుచేసుకుంది. సీఐ సుధాకర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఛత్తీస్గఢ్ రాష్ట్రం చెంపా జిల్లా జంజ్గిర్ మండలం మదీర్ పారా వీధికి చెందిన లోక్నాథ్ ఖర్ష్ బతుకు దెరువు కోసం భార్యాపిల్లలతో నాలుగు నెలల క్రితం హనుమకొండకు వచ్చి మేస్త్రీ పనిచేసుకుంటున్నాడు. ఆయనకు ముగ్గురు ఆడపిల్లలు.
పెద్ద కూతురు చంచల్(5), రెండో కూతురు చాంద్ ఖర్ష్ (3), చిన్న కూతురు రోషిత ఖర్ష్ (6 నెలలు). వీరు పది రోజుల క్రితం కాజీపేట పట్టణం సోమిడిలోని రెడ్డికాలనీలో ఇంటి నిర్మాణ పనులు చేస్తూ అక్కడే రేకుల షెడ్డులో ఉంటున్నారు. నాలుగు రోజులుగా అక్కడ ఇంటి పనులు ఆగిపోవడంతో లోక్నాథ్ ఖర్ష్ వేరే చోట ఇంటి నిర్మాణ పనులు చేస్తున్నాడు. ఆయన భార్య ఎప్పటిలాగే రెడ్డి కాలనీలోని ఇంటిలో 5 ఫీట్ల స్టూల్కు, దర్వాజకు చీరతో ఉయ్యాల కట్టి చిన్న కూతురు రోషిత ఖర్ష్ను పడుకోబెట్టింది.
ఆమె ఇంట్లో పనిచేస్తుండగా స్టూల్ నాలుగు కాళ్లు సరిగా లేక అదుపు తప్పడంతో రోషిత ఖర్ష్ కిందపడి ఆమె నుదిటిపై స్టూల్ పడింది. దీంతో తీవ్ర గాయాలు కాగా నగరంలోని ఓ ప్రైవేట్ దవాఖానకు తరలించారు. చిన్నారి పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యులు ఎంజీఎం దవాఖానకు పంపించగా చికిత్స పొందుతూ మృతి చెందింది.