మేడ్చల్ రూరల్, నవంబర్ 12 : పారా మెడికల్ కోర్సులతో ఉజ్వల భవిష్యత్ సొంతం చేసుకోవచ్చని నిజాం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ డీన్ రామ్మూర్తి పేర్కొన్నారు. మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ మైసమ్మగూడలోని మల్లారెడ్డి విశ్వవిద్యాలయంలో శుక్రవారం పారా మెడికల్, అలియిడ్ మెడికల్ సైన్సెస్ కోర్సులపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నిమ్స్ డీన్ రామ్మూర్తి, దుర్గాబాయి దేశ్ముఖ్ వైద్యశాల డైరెక్టర్ సత్యనారాయణ మూర్తి, మల్లారెడ్డి, నారాయణ వైద్యశాల చైర్మన్ భద్రారెడ్డి, వైస్ చాన్సలర్ వీఎస్కే రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా డీన్ రామ్మూర్తి మాట్లాడుతూ వైద్యశాస్ర్తానికి అనుబంధంగా ఉండే పారా మెడికల్ కోర్సులకు మార్కెట్లో డిమాండ్ ఉందన్నారు. విద్యార్థులు ఎంసెట్లో మెడికల్, డెంటల్ సీటు రాలేదని బాధపడాల్సిన అవసరం లేదని, పారా మెడికల్ కోర్సులతో పీహెచ్డీ వరకు వెళ్లి అంతకు మించిన భవిష్యత్ను సొంతం చేసుకోవచ్చన్నారు. సత్యనారాయణ మూర్తి మాట్లాడుతూ రానున్న పదేళ్లలో 48లక్షల పారా మెడికల్ సాంకేతిక నిపుణులు అవసరమన్నారు. వీఎస్కే రెడ్డి మాట్లాడుతూ తాము మార్కెట్లో డిమాండ్ ఉన్న అన్ని కోర్సులను ఒకేచోట అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. కళాశాలలో చదివే విద్యార్థులకు 100 శాతం ప్లేస్మెంట్ను కల్పిస్తామన్నారు. భద్రారెడ్డి మాట్లాడుతూ 2వేల పడకలు ఉన్న తమ వైద్యశాలలో వెయ్యిమంది పారా మెడికల్ నిపుణులు పని చేస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో అకాడమిక్ డైరెక్టర్ అకాశ్, అగ్రికల్చరల్ సైన్సెస్ డీన్ రాజా రెడ్డి, అడ్మిషన్స్ డైరెక్టర్ పుట్టణ శ్రీనివాస్, పారా మెడికల్ సైన్సెస్ డీన్ అపర్ణ, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.