సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, జనవరి 28 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్ మెట్రో రైలుపై ఆది నుంచి నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్న కేంద్రం ఈసారైనా ధోరణి మార్చుకుంటుందా? ప్రస్తుతం తెలంగాణ ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్న పరిణామమిది. ఒకవైపు బీజేపీ పాలిత రాష్ర్టాలతో పాటు రాజకీయంగా అవసరం అనుకున్న ఇతర రాష్ర్టాల మెట్రోలకు ప్రతి బడ్జెట్లో పెద్దపీట వేస్తున్న కేంద్రంలోని మోదీ సర్కారు.. హైదరాబాద్ మెట్రోకు ఇప్పటిదాకా చిల్లిగవ్వ విదిల్చిన దాఖలాలు లేవు. ఈ నేపథ్యంలో తాజా బడ్జెట్ నిధులు కేటాయింపుల్లో హైదరాబాద్ మెట్రోకు స్థానం దక్కుతుందా? లేదా కాషాయ పార్టీ అంటే కేవలం తెలంగాణ ప్రేమను మాటల్లోనేగానీ చేతుల్లో చూపదనే రివాజును కొనసాగిస్తుందా? అనేది తేలాల్సి ఉంది.
హైదరాబాద్ మహా నగరం నానాటికీ అభివృద్ధి చెందుతున్న విశ్వ నగరం.
తెలంగాణ ప్రభుత్వం గత ఎనిమిది సంవత్సరాల్లో ఎలాంటి రాజీ లేకుండా వేలాది కోట్ల రూపాయలతో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన మౌలిక వసతులు కల్పిస్తున్నది. ఈ నేపథ్యంలో 2007లో మొదలైన ప్రపంచంలోనే అతి పెద్ద పీపీపీ మెట్రో రైలు ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం విజయవంతంగా పూర్తి చేసి అందుబాటులోకి తెచ్చింది. మూడు మార్గాల్లో 69 కిలోమీటర్ల మేర కొనసాగుతున్న ఈ ప్రాజెక్టుకు జనం నుంచి విశేష స్పందన లభిస్తున్నది. ప్రస్తుతం రోజుకు నాలుగున్నర లక్షల మందికిపైగా ప్రయాణికులు మెట్రోను వినియోగించుకుంటున్నారు. అయితే అంతకంతకూ విస్తరిస్తున్న ఈ మహా నగరంలో మెట్రో రైలును కూడా విస్తరించి, ప్రజా రవాణాను మరింత బలోపేతం చేయాల్సిన ఆవశ్యకత నెలకొంది. దీనిని గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే రాయదుర్గం-శంషాబాద్ విమానాశ్రయానికి 31 కిలోమీటర్ల ఎయిర్పోర్టు మెట్రోను కూడా చేపట్టింది. అయితే మెట్రో రెండో దశను కూడా చేపట్టేందుకు నిర్ణయించిన ప్రభుత్వం ఈ మేరకు ప్రతిపాదనలు కూడా సిద్ధం చేసింది.
నాలుగేండ్లుగా నానబెడుతూనే..
మెట్రో మొదటి దశకు సంబంధించి వయబులిటీ గ్యాప్ ఫండ్ బకాయిల్ని కేంద్రం గత నాలుగేండ్లుగా నానబెడుతూనే ఉంది. రూ.14,100 కోట్లతో ప్రపంచంలోనే ఇది అతి పెద్ద పబ్లిక్-ప్రైవేట్-పార్ట్నర్షిప్గా చేపట్టిన ఈ ప్రాజెక్టుకు పది శాతం మొత్తాన్ని అంటే రూ.1,458 కోట్ల మొత్తాన్ని కేంద్రం వయబుల్ గ్యాప్ ఫండ్ (వీజీఎఫ్) కింద సమకూర్చేందుకు అప్పట్లో అంగీకారం జరిగింది. కాగా, నాలుగు సంవత్సరాలుగా బకాయిగా ఉన్న రూ.254 కోట్లను మాత్రం కేంద్రం ఇవ్వడం లేదు. 2017లో స్వయానా ప్రధాని మోదీ ప్రాజెక్టును ప్రారంభించారు. కానీ ఇప్పటివరకు వీజీఎఫ్ బకాయిల్ని ఇవ్వడం లేదు. దీనిపై సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్తో పాటు ఉన్నతాధికారులు అనేకసార్లు లేఖ రాసినా స్పందన లేదు.
మనకు శూన్యం.. ఇతర రాష్ర్టాలకు భోజ్యం..
హైదరాబాద్ మెట్రోకు రావాల్సిన రూ.254 కోట్ల వీజీఎఫ్ నిధులపై నాలుగు సంవత్సరాలకు పైగా మొండికేస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం.. ఇతర రాష్ర్టాల్లోని మెట్రోలకు మాత్రం నిధుల వరదను పారిస్తున్నది. ప్రతి ఏటా రైల్వే బడ్జెట్ల్లో అనేక రాష్ర్టాల్లో మెట్రోలకు అనుమతితో పాటు నిధుల కేటాయింపులు చేపడుతున్నది. ఇప్పటివరకు తెలంగాణకు సంబంధించి మాత్రం ఆ ఊసే ఎత్తడం లేదు. తాజా బడ్జెట్లో కేంద్రం తీరు ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే.
గతంలోనే లేఖ రాసిన మంత్రి కేటీఆర్..
మెట్రో రైలు రెండో దశ ప్రాజెక్టుకు కేంద్రం ఆర్థికంగా చేయూత ఇవ్వాలని గతంలోనే రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు గత ఏడాది నవంబర్ 14వ తేదీన కేంద్ర గృహ,
పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరికి లేఖ రాశారు. మెట్రో రైలు రెండో దశను కూడా రూపొందించాం. రూ.8453 కోట్ల వ్యయంతో 31 కిలోమీటర్ల మేర రూపొందించిన ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని రకాల డాక్యుమెంట్లను పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ద్వారా 27.10.2022న కేంద్రానికి పంపించారు. ఈ నేపథ్యంలో కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ప్రాజెక్టును సంయుక్తంగా చేపట్టేలా అనుమతి ఇవ్వాలని ముఖ్యంగా 2023-24 బడ్జెట్లో ఈ ప్రాజెక్టును పొందుపరచాలని కేటీఆర్ కేంద్ర మంత్రికి రాసిన లేఖలో పేర్కొన్నారు.
మెట్రో రెండో దశ స్వరూపమిది..
అంచనా వ్యయం రూ.8,453 కోట్లు
బీహెచ్ఈఎల్ నుంచిలక్డీకాపూల్ వరకు
– 26 కిలోమీటర్లు – 23 స్టేషన్లు
కారిడార్-3పొడగింపులో భాగంగా నాగోల్ నుంచి ఎల్బీనగర్ వరకు – ఐదు కిలోమీటర్లు – నాలుగు స్టేషన్లు