ముంబై,జూన్ 30: దేశంలో కరోనామొదలైనప్పటి నుంచి మహారాష్ట్రలో కరోనా బీభత్సం సృష్టించినవిషయం తెలిసిందే. కేసుల పరంగా మరణాల పరంగా కూడా మహారాష్ట్ర దేశంలో మొదటి స్థానంలో నిలించింది. ముంబై కూడా కరోనా హాట్స్పాట్గా మారిన సంగతి తెలిసిందే. కఠిన నిబంధనల అనంతరం అక్కడ కూడా కరోనా తగ్గుముఖం పడుతోంది. ముంబైలో ఇప్పటికే 80 శాతం ప్రజలు కరోనా బారినపడి ఉండవచ్చని టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ (టీఐఎఫ్ఆర్) అధ్యయనం వెల్లడించింది. సెకండ్ వేవ్ లో ఎక్కువకేసులు నమోదవ్వడం కారణంగా థర్డ్ వేవ్ అంత తీవ్రంగా ఉండకపోవచ్చని పేర్కొంది.
థర్డ్ వేవ్లో రీ ఇన్ఫెక్షన్లది కీలక పాత్ర కానుందని టీఐఎఫ్ఆర్ స్పష్టం చేసింది.ఇప్పటివరకు రెండోసారి కరోనా సోకినవారు తక్కువగా ఉండటమే దీనికి కారణమని పేర్కొంది టీఐఎఫ్ఆర్. కోవిడ్ సోకని మిగతా 20శాతంమందికి త్వరగా టీకా ఇవ్వడంతో పాటు రీ ఇన్ఫెక్షన్లపై దృష్టిపెట్టడం ద్వారా థర్డ్ వేవ్ తీవ్రతను ముందే పసిగట్టొచ్చని, ఆ తర్వాత చర్యలు, ప్రణాళికతో ముందుకు వెళ్లవచ్చని టీఐఎఫ్ఆర్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ అండ్ కంప్యూటర్ సైన్స్ డీన్ డాక్టర్ సందీప్ జునేజా అన్నారు. కరోనా రీ ఇన్ఫెక్షన్ల తీవ్రత ప్రకారం థర్డ్ వేవ్ను అంచనా వేయవచ్చని పేర్కొన్నారు.సెకండ్ వేవ్లో ఢిల్లీ, బెంగళూరు కంటే అత్యధిక కేసులు ముంబైలోనే నమోదయ్యాయని తెలిపారు. దీని ప్రకారం చూస్తే థర్డ్ వేవ్ తీవ్రత అంతగా ఉండకపోవచ్చని పేర్కొన్నారు.