పనాజీ : గోవాలో కాంగ్రెస్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మాజీ సీఎం దిగంబర్ కామత్, విపక్ష నేత మైఖేల్ లోబో సహా 8 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పాలక బీజేపీలో చేరారు. ప్రధాని నరేంద్ర మోదీ, గోవా సీఎం ప్రమోద్ సావంత్ నాయకత్వాన్ని బలోపేతం చేసేందుకు బీజేపీలో చేరామని మైఖేల్ లోబో వెల్లడించారు. 8 మంది ఎమ్మెల్యేలు బీజేపీ పంచన చేరడంతో గోవాలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల బలం 3కు పడిపోయింది.
కాంగ్రెస్ శాసనసభా పక్షాన్ని బీజేపీలో విలీనం చేస్తూ అసెంబ్లీ కార్యదర్శికి మైఖేల్ లోబో సహా పార్టీ మారిన ఎమ్మెల్యేలు లేఖ అందచేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు దిగంబర్ కామత్, మైఖేల్ లోబో, దిలియ లోబో, రాజేష్ పల్దేశాయ్, కేదార్ నాయక్, సంకల్ప్ అమోంకర్, అలెక్సి సెక్విర, రుడోల్ఫ్ ఫెర్నాండెజ్లు బీజేపీలో చేరారు. అంతకుముందు బీజేపీలో విలీనమైనట్టు గోవా కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ తీర్మానాన్ని ఆమోదించింది.
బీజేపీలో చేరికకు ముందు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సీఎం ప్రమోద్ సావంత్తో భేటీ అయ్యారు. ఇక ఢిల్లీ, పంజాబ్లో విఫలమైన ఆపరేషన్ లోటస్ గోవాలో విజయవంతమైందని ఆప్ నేత రాఘవ్ చద్దా అన్నారు. 40 మంది సభ్యులు కలిగిన గోవా అసెంబ్లీలో కాంగ్రెస్కు 11 మంది ఎమ్మెల్యేలుండగా బీజేపీకి 20 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 2019లోనూ ఇదే తరహాలో 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు.