కొత్తూరు రూరల్, జనవరి 17 : నిషేధిత గంజాయిని సరఫరా చేస్తున్న స్మగ్లింగ్ ముఠాను పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా కొత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని తిమ్మాపూర్ గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. ఈ మేరకు మీడియా సమావేశంలో శంషాబాద్ డీసీపీ పి. జగదీశ్వర్ రెడ్డి వివరాలను వెల్లడించారు.
ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ..భద్రాచలం అటవీ ప్రాంతంలో పండించిన గంజాయిని సూర్యాపేటకు చెందిన నాగరాజు, వినోద్, వరంగల్ కు చెందిన రవి మహారాష్ట్ర, అహ్మద్ నగర్కు చెందిన బాబా చందేకర్, తిరుమలి బాలు, గణేష్, రాజేంద్ర కు సరఫరా చేస్తూ దందా కొనసాగిస్తున్నారు.
ఈ క్రమంలో వినోద్ ఓక్స్ వ్యాగన్ కారులో 214 కిలోల గంజాయి ప్యాకెట్లను మహారాష్ట్ర కు చెందిన బాబా చందేకర్, తిరుమలి బాలు, గణేష్, రాజేంద్ర కారులో గంజాయిని తరలిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడిలో స్మగ్లింగ్ ముఠాను, రూ.70లక్షల విలువగల గంజాయిని, రూ.2.10లక్షల నగదును, 3 కార్లను, 5 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
స్మగ్లింగ్ ముఠాకు చెందిన రవి, నాగరాజు పరారీలో ఉన్నట్లు, ఈ స్మగ్లింగ్ వెనకాల ఇంకా ఎవరెవరు ఉన్నారో పూర్తి స్థాయిలో విచారణ జరిపి అందరిని అరెస్ట్ చేస్తామని డీసీపీ తెలిపారు. కార్యక్రమంలో షాద్ నగర్ ఏసీపీ కుశల్కర్, కొత్తూరు సీఐ భూపాల్ శ్రీధర్, వెంకట్ రెడ్డి, రవి, పోలీస్ కానిస్టేబుల్స్ పాల్గొన్నారు.