రాజన్న సిరిసిల్ల, నవంబర్ 16 (నమస్తే తెలంగాణ): పిల్లల ఈత సరదా కన్నవారికి కడుపు కోత మిగిల్చింది. మానేరు నదికి ఈతకు వెళ్లిన ఆరుగురి విద్యార్థుల్లో ఐదుగురు విగత జీవులవ్వడం, మరొకరి ఆచూకీ దొరక్కపోవడంతో కార్మిక క్షేత్రంలో విషాదం అలుముకున్నది. సోమవారం సాయంత్రం సిరిసిల్ల రాజీవ్నగర్కు చెందిన 9 మంది విద్యార్థులు పట్టణ శివారులోని మానేరు చెక్డ్యాంకు ఈతకు వెళ్లగా ఆరుగురు గల్లంతైన విషయం తెలిసిందే. రంగంలోకి దిగిన పోలీసులు.. కొలిపాక గణేశ్(14) మృతదేహాన్ని సోమవారమే వెలికితీశారు.
కొంగ రాకేశ్(14), జడల వెంకటసాయి(14), శ్రీరాం క్రాంతికుమార్(15), అజయ్ (14) మృతదేహాలు మంగళవారం లభించాయి. మరో విద్యార్థి సింగం మనోజ్(16) కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. పిల్లల ఆచూకీ కోసం ఎదురుచూస్తున్న తల్లిదండ్రులు.. ఒక్కొక్కరి మృతదేహం బయటపడుతున్న కొద్దీ గుండెలవిసేలా రోదించారు. క్రాంతికుమార్ పుట్టినరోజు మంగళవారమే కావడంతో అతని తల్లిదండ్రులను ఓదార్చడం ఎవరివల్ల కాలేదు.
మృతిచెందిన ఐదుగురు విద్యార్థులు నేత కుటుంబానికి చెందినవారే. సిరిసిల్లలోని జడ్పీహెచ్ఎస్లో 8వ తరగతి చదువుతున్నారు. సింగం మనోజ్ (16) ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. సోమవారం పాఠశాలలో బాలల దినోత్సవ వేడుకలు ఉండటంతో ఈ ఆరుగురితోపాటు అఖిల్, వాసాల కల్యాణ్, కోట అరవింద్ ఈతకు వెళ్లారు. సైకిళ్లు, చెప్పులు ఒడ్డున పెట్టి నీళ్లలో దిగిన వెంటనే పిల్లలు మునిగిపోవడంతో.. కళ్యాణ్, అఖిల్, అరవింద్ భయంతో ఇంటికి వెళ్లారు. అక్కడే చేపలు పడుతున్న మత్స్యకారుడు పోలీసులకు సమాచారం అందించాడు. వెంటనే పోలీసులు, రెస్క్యూటీం ఘటనాస్థలికి చేరుకొని గాలింపు చేపట్టారు. ఓవైపు భారీ వర్షం కురుస్తున్నప్పటికీ గాలింపును కొనసాగించారు. మంగళవారం నలుగురి మృతదేహాలు లభ్యంకాగా, మనోజ్ ఆచూకీ దొరకలేదు. కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పీ రాహుల్హెగ్డే సహాయక చర్యలను పర్యవేక్షించారు.
హైదరాబాద్: మానేరులో ఆరుగురు విద్యార్థులు గల్లంతై, ఐదుగురు మృతిచెందిన ఘటనపై ఐటీశాఖ మంత్రి కేటీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. చనిపోయిన బాలుర కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. నియోజకవర్గంలోని జలాశయాలు నిండి ఉన్నందున ప్రజలు ఆయా ప్రాంతాల్లోకి వెళ్లేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని విజ్ఞప్తిచేశారు. ప్రాజెక్టుల వద్ద సాధ్యమైనన్ని రక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు అన్నివిధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.