చెన్నై: కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటంతో ప్రభుత్వాలు అప్రమత్తమవుతున్నాయి. ఒక్కో ప్రాంతంలో లాక్డౌన్ అమలు చేస్తుండగా, మరికొన్ని ప్రాంతాల్లో వైరస్ వ్యాప్తిని కట్టడిచేయడానికి కరోనా నిబంధనలను కఠినంగా అమలుచేస్తున్నారు. ఇందులో భాంగా ప్రముఖ పర్యాటక కేంద్రమైన ఊటీలో మాస్క్ ధరించని వారికి ఆరు నెలల జైలుశిక్ష విధిస్తామని అధికారులు ప్రకటించారు.
గత కొన్నిరోజులుగా ఊటీలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నది. ప్రజలు మాస్కులు లేకుండా బహిరంగ ప్రాంతాల్లో విచ్చలవిడిగా తిరుగుతుండటంతోపాటు సభలు, సమావేశాల్లో పాల్గొనడమే దీనికి కారణమని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. దీంతో నీలగిరి జిల్లా కలెక్టర్ ఇన్సెంట్ దివ్య హెచ్చరికలు జారీ చేశారు.
ఊటీలోని ప్రజలు, పర్యాటకులు మాస్కులు ధరించకుండా సంచరిస్తే ఆరు నెలల జైలుశిక్ష విధిస్తామని ప్రకటించారు. ఇలాంటి వారిని గుర్తించేందుకు ఇప్పటికే 20 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామన్నారు. మాస్కు లేకుండా పట్టుబడినవారికి ఆరు నెలల జైలుతోపాటు రూ.200 జరిమానా కూడా విధిస్తామని తెలిపారు. ఇప్పటివరకు జరిమానాల రూపంలో రూ.30.68 లక్షలు వసూలు చేశామని వెల్లడించారు.