మేడ్చల్ మల్కాజ్గిరి : రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు ఇవాళ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డితో కలిసి మేడ్చల్లో ఓ ప్రయివేటు ఆస్పత్రిని హరీశ్రావు ప్రారంభించారు. అనంతరం మంత్రి హరీశ్రావు మీడియాతో మాట్లాడుతూ.. మంత్రి మల్లారెడ్డి కోరిక మేరకు మేడ్చల్ మండలంలో రూ. 10 కోట్లతో మరో 50 పడకల ఎంసీహెచ్ ఆసుపత్రిని మంజూరు చేస్తామన్నారు. మార్చి తర్వాత మంజూరు చేసి, ఏప్రిల్లో శంకుస్థాపన చేసి పనులు ప్రారంభిస్తామని తెలిపారు. ఆస్పత్రికి అవసరమైన అన్ని రకాల సిబ్బందిని కూడా నియమిస్తామని చెప్పారు.
ఎంసీహెచ్ ఆస్పత్రికి అనుబంధంగా రూ. కోటితో ఎస్ఎన్సీయూ కేంద్రాన్ని కూడా నిర్మిస్తామన్నారు. ముఖ్యమంత్రి కేసీఅర్ ప్రారంభించిన కేసీఆర్ కిట్ పథకం దేశానికే ఆదర్శంగా నిలిచింది. ఈ పథకం అమలైన తర్వాత ప్రభుత్వ ఆసుపత్రుల్లో 30 శాతం నుండి 52 శాతానికి ప్రసవాలు పెరిగాయన్నారు. రాష్ట్రంలో అవసరం ఉన్న ప్రాంతాల్లో ఎంసీహెచ్, ఎస్ఎన్సీయూ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు.