పుణె: మహారాష్ట్రలోని పుణెలో (Pune) నిర్మాణంలో ఉన్న భవనం కూలడంతో ఐదుగురు మృతిచెందారు. పుణెలోని ఎరవాడ శాస్త్రీనగర్లో ఓ షాపింగ్ మాల్ కడుతున్నారు. ఇందులో భాగంగా శ్లాబ్ వేయడంకోసం సెంట్రింగ్ పనిచేస్తున్నారు. అయితే గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత అది ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో కింద పనిచేస్తున్న పదిమంది కూలీలపై (Labourers) అది పడిపోయింది. దీంతో ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఐదుగురు కూలీలు తీవ్రంగా గాయపడ్డారు.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీశారు. గాయపడినవారి దవాఖానకు తరలించారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నదని పుణె డీసీపీ రోహిదాస్ పవార్ తెలిపారు. బాధితులంతా బీహార్కు చెందిన వారని వెల్లడించారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదన్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.