మేడ్చల్, జనవరి 26 (నమస్తేతెలంగాణ): ఆది నుంచి అణగారిన దళితులను ధనవంతులను చేయడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని, వారు ఆర్థికంగా స్థిరపడడమే దళితబంధు లక్ష్యమని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళితబంధు పథకం దేశానికే రోల్మోడల్ కానుందని చెప్పారు. దళిత కుటుంబాల ఆర్థిక స్వావలంబన సాధించడం కోసం ప్రతి కుటుంబానికి రూ.10 లక్షలు కేటాయిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమని ఆయన చెప్పారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని మేడ్చల్, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, మల్కాజిగిరి, ఉప్పల్ నియోజకవర్గాల్లో మార్చి నుంచి మొదటిదశ దళితబంధు పథకాన్ని విజయవంతంగా అమలు చేస్తామని బుధవారం ప్రత్యేక ఇంటర్వ్యూలో మంత్రి వెల్లడించారు. ఆ వివరాలు..
ప్రశ్న: జిల్లాలో దళితబంధు పథకానికి మొదటిదశలో ఎన్ని నిధులు ఇచ్చారు ?
మంత్రి: మొదటివిడుతలో 500 మంది లబ్ధిదారులకు రూ.50 కోట్లు మంజూరు చేసింది. జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో నియోజకవర్గానికి 100 మంది చొప్పున 500 మందికి దళితబంధును అందిస్తాం. ఫిబ్రవరి 5 నాటికి లబ్ధిదారుల జాబితాను ఎమ్మెల్యేల సహకారంతో ప్రత్యేక అధికారులు సిద్ధం చేస్తారు. ఫిబ్రవరి చివరివారం నుంచి మార్చి వరకు మొదటిదశ దళితబంధు నిధులను వారి బ్యాంకు ఖాతాల్లో జమచేస్తాం.
ప్రశ్న: ఈ పథకం ద్వారా దళితులు ఎలా అభివృద్ధి చెందుతారు ?
మంత్రి: దళితబంధు పథకం ద్వారా ఇచ్చే డబ్బులతో అనేక వ్యాపారాలు చేసుకోవచ్చు. దళితబంధు డబ్బును తిరిగి ప్రభుత్వానికి చెల్లించాల్సిన అవసరం లేదు. వ్యాపారంలో వచ్చిన ప్రతిపైసా వారికి చెందుతుంది. 30 రకాల వ్యాపారాలు నిర్వహించుకోవచ్చు.
ప్రశ్న: దళితబంధు పథకంపై దళితుల స్పందన ఎలా ఉంది ?
మంత్రి: దేశంలో ఇప్పటివరకు దళితుల కోసం ఇలాంటి పథకం తీసుకరాలేదు. మొదటిసారిగా సీఎం కేసీఆర్ రాష్ట్రంలో అమలు చేస్తున్నారు. రైతుబంధును విజయవంతం చేసిన ముఖ్యమంత్రి..దళితబంధును రాష్ర్టంలోని ప్రతి దళిత కుటుంబానికి వర్తింపజేస్తారు. దళితబంధు పథకాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకొని ముఖ్యమంత్రి అశయాన్ని నెరవేర్చేలా కష్టపడుతామని చెబుతున్నారు.
ప్రశ్న: ఈ పథకంపై వివిధ పార్టీలు ఆరోపణలు చేస్తున్నాయి కదా ?
మంత్రి: దళితబంధు పథకం రాష్ట్రమంతటా అమలు చేస్తామన్న తర్వాత ప్రతిపక్షాల నోళ్లు మూతపడ్డాయి. దళితబంధుపై మాట్లాడే హక్కు బీజేపీకి లేదు. ఈ పథకం సాధ్యంకాదు, ఎన్నికల స్టంట్ అన్న ఆ పార్టీ నేతలకు ముఖ్యమంత్రి కేసీఆర్ దిమ్మ తిరిగే సమాధానమిచ్చారు. బీజేపీకి దమ్ముంటే వారు అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో దళితబంధు అమలు చేయాలి. భవిష్యత్లో బీజేపీ అడ్రస్ గల్లంతు కావడం ఖాయం. తెలంగాణ అభివృద్ధికి ఆ పార్టీ సహకరించడం లేదు.
ప్రశ్న: ప్రతి దళిత కుటుంబానికి పథకం వర్తింపు ఎలా సాధ్యం ?
మంత్రి: ప్రతి దళిత కుటుంబానికి దళితబంధు అందేలా క్షేత్రస్థాయిలో పర్యటించి లబ్ధిదారులను గుర్తిస్తాం. ఎమ్మెల్యేలు, కలెక్టర్, ప్రత్యేక కమిటీ అధికారులతో సమావేశాలు నిర్వహిస్తాం. అర్హులకే పథకాన్ని వర్తింపజేస్తాం.