న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీ పోలీసుశాఖలో కరోనా కలకలం సృష్టిస్తున్నది. ఈ నెల ఒకటో తేదీ నుంచి ఇప్పటి వరకు 2,500 మంది సిబ్బంది వైరస్కు పాజిటివ్గా పరీక్షలు చేయగా.. ఇందులో 767 మంది కోలుకున్నారని ఓ అధికారి తెలిపారు. తాజా సమాచారం ప్రకారం.. ఈ నెల ప్రారంభం నుంచి శాఖలోని అన్ని ర్యాంకులు, యూనిట్ల నుంచి దాదాపు 2,500 మంది ఢిల్లీ పోలీసులు కొవిడ్ బారినపడ్డారు. ఇదిలా ఉండగా.. ఢిల్లీ పోలీస్ అధికార ప్రతినిధి, అడిషనల్ సీపీ (క్రైమ్) చిన్మయ్ బిస్వాల్కు వైరస్ సోకినట్లు నిర్ధారణ కాగా.. కోలుకొని తిరిగి డ్యూటీలో చేరినట్లు సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు.
ఇప్పటి వరకు 767 మంది సిబ్బంది కొవిడ్ నుంచి కోలుకున్నారని, విధుల్లో చేరారని ఢిల్లీ పోలీస్ పీఆర్వో బిస్వాల్ తెలిపారు. కాగా, అర్హులైన వారికి బూస్టర్ డోసు వేసేందుకు అన్ని స్థాయిల్లో సిబ్బందికి ప్రత్యేక శిబిరం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఢిల్లీలో 80వేలమందికిపైగా సిబ్బంది ఉన్నారని అధికారులు పేర్కొన్నారు. పోలీసు సిబ్బంది కొవిడ్ చర్యలు తీసుకోవాలని, ఏదైనా అనారోగ్యానికి గురైతే.. పర్యవేక్షణ అధికారికి తప్పకుండా సమాచారం ఇవ్వాలని ఉత్తర్వుల్లో సూచించింది.