న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఎండలు మండుతున్నాయి. వరుసగా 25 రోజుల నుంచి నగరంలో 42 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు కన్నా తక్కువ నమోదు కావడం లేదు. 2012 తర్వాత ఈ రేంజ్లో ఢిల్లీలో ఎండలు మండడం ఇదే తొలిసారి అని వాతావరణ శాఖ తెలిపింది. 2012లో కూడా ఢిల్లీలో వరుసగా 30 రోజుల పాటు 42 లేదా అంత కన్నా ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. 2010లో 35 రోజుల పాట ఎండలు దంచికొట్టినట్లు ఐఎండీ తన డేటాలో తెలిపింది. 2021లో కేవలం ఆరు రోజుల మాత్రమే ఎండలు మండాయి. 2020లో అది కేవలం మూడు రోజులే ఉంది. 42 డిగ్రీలు ఉష్ణోగ్రత దాటిన రోజుల్ని ఐఎండీ రిలీజ్ చేసింది.
2019లో 16 రోజులు, 2018లో19 రోజులు, 2016, 2017లో 15 రోజులు, 2015 లో 18 రోజులు, 2014లో 15 రోజులు, 2013లో 17 రోజుల పాటు ఉష్ణోగ్రతులు 42 డిగ్రీలు దాటాయి. అయితే 1953, 1953, 1971 సంవత్సరాల్లో వెదర్ డేటా లేదు. ఈ ఏడాది ఎండలు ముందే వచ్చేశాయి. మార్చి, ఏప్రిల్ నెలలోనే భానుడి భగభగలాడాడు. 1951 తర్వాత ఏప్రిల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. ఢిల్లీలో ఈ సారి ఆరుసార్లు హీట్వేవ్ వచ్చినట్లు ఐఎండీ తెలిపింది. మే నెల మధ్య భాగంలో అత్యధికంగా 49 డిగ్రీలు అందుకున్నట్లు తెలిపారు. పశ్చిమ వేడి గాలుల వల్ల ఇంకా ఢిల్లీ ప్రాంతంలో వేడి వాతావరణం కొనసాగుతోంది.