న్యూఢిల్లీ, ఫిబ్రవరి 12: మరో భారీ బ్యాంక్ మోసం వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులను ఏబీజీ షిప్యార్డ్ ఏకంగా రూ.22,842 కోట్లు ముంచింది. ఈ మేరకు ఎస్బీఐ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సదరు సంస్థ, దాని మాజీ చైర్మన్, ఎండీ రిషీ కమలేశ్ అగర్వాల్, మరికొందరిపై సీబీఐ కేసు నమోదు చేసింది. దేశంలో అతిపెద్ద బ్యాంకింగ్ కుంభకోణం ఇదేనని కేంద్ర దర్యాప్తు సంస్థ అధికారులు ఈ సందర్భంగా పేర్కొనడం గమనార్హం. సూరత్, భరూచ్, ముంబై, పుణె తదితర ప్రాంతాల్లో కంపెనీ డైరెక్టర్లకు చెందిన 13 చోట్ల శనివారం సోదాలు నిర్వహించామని, నేరారోపణలకు సంబంధించి కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నామని ఓ ప్రకటనలో సీబీఐ తెలియజేసింది. మరో అనుబంధ కంపెనీలోనూ అధికారులు తనిఖీలు చేశారు. ఈ క్రమంలోనే కమలేశ్ అగర్వాల్తోపాటు గత ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శంతనం ముత్తుస్వామి, డైరెక్టర్లు అశ్వినీ కుమార్, సుశీల్ కుమార్ అగర్వాల్, రవీ విమల్ నవితియా, ఏబీజీ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్పై నేరపూరిత కుట్ర, మోసం, నమ్మకద్రోహం, కర్తవ్య నిర్వహణలో అధికారాల ఉల్లంఘనలకుగాను ఐపీసీ, అవినీతి నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేశారు.
గతంలోనూ ఆరోపణలు
కార్పొరేట్ కార్యకలాపాల్లో ముంబై ప్రధాన కేంద్రంగా, వ్యాపార కార్యకలాపాల్లో గుజరాత్ కేంద్రంగా నడుస్తున్న ఏబీజీ షిప్యార్డ్పై గతంలోనూ పలు ఆరోపణలు వచ్చాయి. 2012-17 మధ్య జరిగిన ఓ ఫోరెన్సిక్ ఆడిటింగ్లో నిందితులు కుమ్మక్కై అక్రమ కార్యకలాపాలకు పాల్పడ్డారని, నిధులను మళ్లించారని స్పష్టమైనట్టు సీబీఐ చెప్తున్నది. కాగా, నౌకల నిర్మాణం, వాటి రిపేర్లో ఏబీజీ గ్రూప్ ప్రధాన సంస్థ ఏబీజీ షిప్యార్డ్ కార్యకలాపాలు సాగుతున్నాయి. దేశీయ నౌకా నిర్మాణ పరిశ్రమలో ఏబీజీ షిప్యార్డ్ ప్రముఖ సంస్థగా ఉన్నది. గుజరాత్లోని దహేజ్, సూరత్లలో షిప్ నిర్మాణ యూనిట్లు, గోవాలో షిప్ రిపేర్ యూనిట్ ఉన్నది.
ఇవీ కేసు వివరాలు
ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్సహా 28 బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి ఏబీజీ షిప్యార్డ్ పెద్ద ఎత్తున రుణాలు తీసుకున్నది. ఆ తర్వాత సంస్థ రుణాలు చెల్లించకపోవడంతో 2016 జూలైలో ఈ ఖాతాను మొండి బకాయి (నిరర్థక ఆస్తి లేదా ఎన్పీఏ)గా ప్రకటించారు. 2019లో మోసంగా తేల్చారు. ఇదే ఏడాది నవంబర్ 8న ఎస్బీఐ ఫిర్యాదు చేయగా, 2020 మార్చి 12న మరింత సమాచారం కావాలని సీబీఐ కోరింది. ఈ క్రమంలో అదే ఏడాది ఆగస్టులో ఎస్బీఐ మళ్లీ కొత్తగా ఫిర్యాదు చేసింది. అన్నీ పరిశీలించాక దాదాపు ఏడాదిన్నర తర్వాత ఈ నెల 7న సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఈ కేసులో ఎస్బీఐ రుణాల వాటా రూ.2,468.51 కోట్లుగా ఉన్నట్టు అధికారులు చెప్తున్నారు. అలాగే ఐసీఐసీఐ బ్యాంక్కు రూ.7,089 కోట్లు, ఐడీబీఐ బ్యాంక్కు రూ.3,634 కోట్లు, బీవోబీకి రూ.1,614 కోట్లు, పీఎన్బీకి రూ.1,244 కోట్లు, ఐవోబీకి రూ.1,228 కోట్లు బకాయిలున్నాయి. రుణాల సొమ్మును ఏబీజీ షిప్యార్డ్ పక్కదారి పట్టించిందని చెప్పారు. కాగా, ఏబీజీ షిప్యార్డ్ దివాలా ప్రక్రియ కోసం ఎన్సీఎల్టీ అహ్మదాబాద్ ధర్మాసనాన్ని ఐసీఐసీఐ బ్యాంక్ ఇప్పటికే ఆశ్రయించిందని వెల్లడించారు.