హైదరాబాద్, నవంబర్ 8 (నమస్తే తెలంగాణ): దళితబంధుకు వచ్చే బడ్జెట్లో రూ.20 వేల కోట్లు కేటాయిస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ప్రకటించారు. వచ్చే మార్చినాటికి హుజూరాబాద్లో సంపూర్ణంగా అమలవుతుందని తెలిపారు. దళితులకు ఇచ్చే డబ్బు సద్వినియోగం కావాలనే ఉద్దేశంతో లైసెన్స్ ఇచ్చే అన్ని రంగాల్లో ప్రభుత్వం రిజర్వేషన్లు కల్పిస్తున్నట్టు తెలిపారు. సీఎం కేసీఆర్ సోమవారం ప్రగతిభవన్లో మీడియాతో మాట్లాడుతూ.. ‘దళితబంధు గురించి మాట్లాడే తెలివి ఉందా నీ ముఖానికి? దళితబంధు ఏంటో? ఎట్ల? ఎందుకు పుట్టిందో తెలుసా?’ అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితులు ఆర్థికంగా, సామాజికంగా ఎదగాలనే లక్ష్యంతో ప్రపంచంలోనే ఎక్కడా లేనివిధంగా ఈ పథకాన్ని అమలుచేస్తున్నట్టు తెలిపారు. ‘మేం నిధులు రిలీజ్ చేయబోమంటున్నరు. నీ మొఖమా రిలీజ్ చేసేది? మేం రూ.20 వేల కోట్లు పెడుతా అంటున్నం కదా. అంత హుందాతనం ఉన్న కేంద్రమే అయితే మేం కూడా రూ.20 వేల కోట్లు ఇస్తమని ముందుకు రావాలె. గొప్ప పనికి భుజం తట్టాలె’ అని వ్యాఖ్యానించారు. దళితబంధు అమలు విషయంలో సన్నాసుల మాటలు పట్టించుకోవద్దని సూచించారు.
అన్నింటా రిజర్వేషన్లు కల్పిస్తున్నాం..
దళితబంధు పథకం పూర్తిగా సద్వినియోగం కావాలనే ఉద్దేశంతో లబ్ధిదారులు కోరుకొన్న, వారికి నైపుణ్యం ఉన్న వ్యాపారంలో శిక్షణ ఇచ్చి ప్రోత్సహిస్తున్నట్టు కేసీఆర్ తెలిపారు. దేశ చరిత్రలో తొలిసారి దళితులకు అన్ని ప్రభుత్వ లైసెన్సులు ఇచ్చే వా టిలో రిజర్వేషన్లు పెడుతున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు.
దశలవారీగా కంప్లీట్ చేస్తం..
దళితబంధుకు వచ్చే బడ్జెట్లో రూ.20 వేల కోట్లు పెడుతామని, 2 లక్షల కుటుంబాలకు ఈ పథకం వస్తుందని కేసీఆర్ తెలిపారు. ఇంకా తెలంగాణ ఆర్థిక పరిస్థితి పెరిగితే మరింత పెంచుకుంటూ ముందుకు పోతామన్నారు. ప్రతి ఏడాది కొన్ని లక్షల కుటుంబాలకు ఇస్తూ నాలుగైదు ఏండ్లలో దశలవారీగా కంప్లీట్ చేస్తామని చెప్పారు. తెలంగాణ దళితజాతి ఎంత బాగుపడుద్దో ఏడాది రెండేండ్లలో చేసి చూపిస్తామన్నారు. వచ్చే ఎన్నికల నాటికి కనీసం 5-6 లక్షల కుటుంబాలకు దళితబంధు అమలయ్యేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
నాలుగు మండలాలకు నేనే పోత..
ప్రస్తుతం నాలుగు మండలాల్లో దళితబంధు అమలవుతున్నదని, ఇప్పటికే వాటికి రూ.200 కోట్లు విడుదల చేశామని కేసీఆర్ తెలిపారు. ఆ నాలుగు మండలాలకు స్వయంగా తానే వెళ్తానని స్పష్టంచేశారు. త్వరలో లబ్ధిదారులను పిలిచి రిసోర్స్పర్సన్తో హైదరాబాద్లో సమావేశం పెడుతామని, 100 శాతం కుటుంబాలకు అమలుచేస్తామని తెలిపారు. దీంతోపాటు మిగతా నియోజకవర్గాలన్నింటిలో కూడా వంద కుటుంబాల చొప్పున దళితబంధు అమలు చేస్తామన్నారు.