హైదరాబాద్, జనవరి 21 (నమస్తే తెలంగాణ): ఆర్టీసీకి సంక్రాంతి పండుగ కలిసొచ్చింది. రాష్ట్రంలోని వివిధ ప్రాం తాలతోపాటు వివిధ రాష్ర్టాలకు ప్రత్యేక బస్సులు నడుపడం ద్వారా రికార్డుస్థాయి ఆదాయం సమకూరినట్టు యాజమా న్యం ప్రకటించింది. కేవలం 11 రోజుల్లో రూ.165.46 కోట్ల ఆదాయం లభించిందని, గత ఏడాదితో పోల్చితే రూ.62.29 కోట్లు అధికమని సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. 2.82 కోట్ల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చినట్టు చెప్పారు. సాధారణ చార్జీలతోనే 3,923 ప్రత్యేక బస్సులు తిప్పడం, రిజర్వేషన్ చేసుకొన్న వారికి తిరుగు ప్రయాణంలో 10 శాతం రాయితీ, టోల్ప్లాజాల వద్ద ప్రత్యేక లైన్ల ఏర్పాటు తదితర చర్యల వల్ల ఆర్టీసీ బస్సులను ఎకువగా ఆదరించారని అన్నారు.
ఆర్టీసీ బస్సుల్లోనే సురక్షితం
ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం సురక్షితమనే విషయాన్ని ప్రజలు మరోసారి నిరూపించారని టీఎస్ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ సజ్జనార్ తెలిపారు. కార్మికుల సహకారంతో సంస్థను మరింత ముందుకు తీసుకెళ్తామని పేర్కొన్నారు. ఆర్టీసీని ఆదరించిన ప్రయాణికులు, సహకరించిన నేషనల్ హైవేస్ అథారిటీ అధికారులు, పోలీసులకు వారు కృతజ్ఞతలు తెలిపారు.