హైదరాబాద్, నవంబర్ 4 (నమస్తే తెలంగాణ): ఈ ఏడాది కృష్ణా నదిలో వరద రికార్డు స్థాయిలో పోటెత్తింది. ఎగువన కర్ణాటక, మహారాష్ట్రతోపాటు రాష్ట్రంలోని క్యాచ్మెంట్ ఏరియాలోనూ విస్తారంగా వర్షాలు కురుస్తుండటమే ఇందుకు కారణం. దీంతో ఏకంగా 1,648 టీఎంసీల జలాలు సముద్రానికి తరలిపోయాయి. గత మూడున్నర దశాబ్దాల్లో ఇదే అత్యధికం. కృష్ణా నుంచి 1990-91లో 1,250.19 టీఎంసీలు, 1994-95లో 1,329.30 టీఎంసీలు, 1998-99లో 1,226.50 టీఎంసీలు, 2005-06లో 1,249.49 టీఎంసీలు, 2020-21లో 1,278.12 టీఎంసీలు, 2022-23లో 1,331.55 టీఎంసీలు సముద్రంలో కలిశాయి.
ఈ ఏడాది ఆ రికార్డు బద్దలయింది. వాస్తవానికి అక్టోబర్ మొదటి వారం నాటికే కృష్ణా నుంచి 1,386 టీఎంసీలు సముద్రం పాలయ్యాయి. గత నెల రోజుల వ్యవధిలో మరో 262 టీఎంసీల జలాలు తరలిపోవడంతో మొత్తంగా ఇప్పటివరకు 1,648 టీఎంసీలు సముద్రంలో కలిశాయి. ఈ ఏడాది కృష్ణా నదికి దాదాపు 2 వేల టీఎంసీల వరద వచ్చినట్టు అధికారులు చెప్తున్నారు. కాగా, పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్, మల్యాల, ముచ్చమర్రి లిఫ్ట్ల ద్వారా ఏపీ ఇప్పటికే 240 టీఎంసీలకుపైగా జలాలను తరలించుకుపోయింది.