రాయపోల్ ఫిబ్రవరి 02 : సిద్ధిపేట జిల్లా రాయపోల్ మండలంలోని 19 గ్రామపంచాయతీలకు తొలి విడతగా 15 ఫైనాన్స్ కమిషన్ 2023-24 ఏడాదికి సంబందించిన నిధులు రూ.36 లక్షల 85 వేల 42 రూపాయలు విడుదలయ్యాయి. మరో ఐదు విడతల్లో నిధులు రావాల్సి ఉన్నది. రెండేళ్లుగా స్పెషల్ ఆఫీసర్ల పాలనలో కొనసాగిన గ్రామపంచాయతీలకు నిధులు అందకపోవడంతో అప్పట్లో పలు అభివృద్ధి పనులకు సొంతంగా ఖర్చు చేయాల్సి వచ్చిందని పంచాయతీ కార్యదర్శులు చెబుతున్నారు. ఇప్పుడొచ్చిన నిధులతో ముందుగా అప్పటి బకాయిలు చెల్లించాలని పంచాయతీ కార్యదర్శులు డిమాండ్ చేస్తున్నారు.
అయితే కేంద్రం నుంచి విడతల వారీగా నిధులు విడుదలవుతుండటంతో వచ్చిన మొత్తానికి అనుగుణంగా బకాయిలు చెల్లిస్తామని సర్పంచులు స్పష్టం చేస్తున్నారు. మొత్తం బకాయిలు ఒకేసారి చెల్లించాలన్న కార్యదర్శుల పట్టుదలతో ఇరువర్గాల మధ్య మనస్పర్ధలు తలెత్తే పరిస్థితి నెలకొంది. నిధుల వినియోగం, బకాయిల చెల్లింపుపై స్పష్టత రాకపోతే గ్రామస్థాయిలో పాలనపై ప్రభావం పడే అవకాశం ఉందన్న చర్చ ఊపందుకుంది. జిల్లా అధికారుల సమన్వయంతో ఈ వివాదానికి త్వరితగతిన పరిష్కారం లభించాలని ప్రజలు ఆశిస్తున్నారు.