Bengaluru | బెంగళూరు, ఏప్రిల్ 21: బెంగళూరుకు చెందిన ఒక కంపెనీ ప్రకటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ట్రోవ్ ఎక్స్పీరియెన్సెస్ అనే కంపెనీ ఏప్రిల్ 28న ‘ఫారెస్ట్ బాతింగ్’ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్టు ఒక ప్రకటన ఇచ్చింది. ఇందులో చెట్లను కౌగిలించుకోవడం, అడవిలో నడవడం వంటివి ఉంటాయని, మానసిక ఒత్తిడిని దూరం చేసుకునేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని ఈ కంపెనీ పేర్కొన్నది.
బెంగళూరు హైకోర్టు పక్కనే ఉన్న కబ్బన్ పార్క్లో జరగనున్న ఈ కార్యక్రమంలో పాల్గొనే వారు ఒక్కొక్కరు రూ.1,500 చెల్లించాలని ప్రకటించింది. ఈ ప్రకటన చూసిన నెటిజన్లు సోషల్ మీడియాలో రకరకాలుగా స్పందిస్తున్నారు. ‘మార్కెట్లోకి కొత్త స్కామ్ వచ్చింది.. చెట్లను కౌగిలించుకునేందుకు రూ.1,500 ఏంటి?’ అంటూ కొందరు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.