కోహిమా, డిసెంబర్ 5: నాగాలాండ్లో శనివారం భద్రతా బలగాలు చేపట్టిన తీవ్రవాద నిరోధక ఆపరేషన్లో భారీ తప్పిదం జరిగింది. ఓ వాహనంలో వెళ్తున్న కూలీలను తీవ్రవాదులుగా పొరబడిన బలగాలు వారిపైకి కాల్పులు జరిపాయి. మోన్ జిల్లాలో మధ్యాహ్నం జరిగిన ఈ ఘటనలో ఆరుగురు పౌరులు అక్కడికక్కడే చనిపోయారు. దీనిపై స్థానికుల్లో ఆగ్రహావేశాలు పెల్లుబికాయి. సాయంత్రం స్థానికులంతా సైన్యాన్ని చుట్టుముట్టారు. ఆత్మ రక్షణ కోసం బలగాలు మళ్లీ ప్రజలపైకి కాల్పులు జరిపాయి. ఈ సారి కాల్పుల్లో ఏడుగురు పౌరులు చనిపోయారు. భద్రతా బలగాల కాల్పుల్లో మొత్తంగా 13 మంది సాధారణ పౌరులు మృతి చెందారు. 11 మంది గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నది. తర్వాత చెలరేగిన హింసలో మరో పౌరుడు, ఒక సైనికుడు కూడా చనిపోయాడు. మరికొంత మంది సైనికులకు గాయాలయ్యాయి. ఉద్రిక్తతల నేపథ్యంలో మోన్ జిల్లాలో కర్ఫ్యూ విధించారు. ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు.
బాధ్యులపై చర్యలు
‘మోన్లో తీవ్రవాదులున్నారన్న కచ్చితమైన సమాచారంతోనే ఆపరేషన్ చేపట్టాం. జరిగిన ఘటన చాలా దురదృష్టకరమైనది. తీవ్ర పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నాం. ఘటనపై దర్యాప్తునకు ఆదేశించాం. బాధ్యులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకొంటాం’ అని సైన్యం ఒక ప్రకటనలో తెలిపింది.
కేంద్రం నిజం చెప్పాలి
ప్రజలపై బలగాలు కాల్పులు జరుపడాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ, బెంగాల్ సీఎం మమత, విపక్షాలు తీవ్రంగా ఖండించాయి. కేంద్రప్రభుత్వం ప్రజలకు వాస్తవాన్ని చెప్పాలని రాహుల్ డిమాండ్ చేశారు. కేంద్ర హోంశాఖ ఏం చేస్తున్నదని ప్రశ్నించారు. అటు ప్రజలకు, ఇటు బలగాలకు.. ఇద్దరికీ రక్షణ లేకుండా పోయిందన్నారు.
సంయమనం పాటించండి
ఘటనను నాగాలాండ్ సీఎం నెయ్ప్యూ రియో తీవ్రంగా ఖండించారు. దర్యాప్తునకు సిట్ను నియమించారు. మృతుల కుటుంబాలకు న్యాయం చేస్తామని, ప్రజలు సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు.