తెలంగాణ హైకోర్టుకు ఏడుగురు
న్యూఢిల్లీ: మూడు హైకోర్టులకు బుధవారం కొత్తగా 14 మంది జడ్జిలు నియమితులయ్యారు. వీరిలో 12 మంది జ్యుడిషియల్ అధికారులు, ఒకరు న్యాయవాది, మరొకరు ఆదాయ పన్ను అప్పిలేట్ ట్రిబ్యునల్ (ఐటీఏటీ) సభ్యురాలు ఉన్నారు. ఏడుగురు జడ్జిలు తెలంగాణ హైకోర్టుకు, నలుగురు కేరళ హైకోర్టుకు, ముగ్గురు ఒడిశా హైకోర్టుకు నియమితులయ్యారు. తాజా నియామకాలతో జాబితాను కేంద్ర న్యాయ శాఖ విడుదల చేసింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని కొలీజియం గత నెలలో వివిధ హైకోర్టుల జడ్జిలుగా నియామకానికి 100 మందికి పైగా పేర్లను సిఫారసులు చేసింది. వాటికి కేంద్ర ప్రభుత్వం విడుతల వారీగా ఆమోదం తెలుపుతున్నది. మంగళవారం ఒక్కరోజే పలు హైకోర్టులకు 17 మంది జడ్జిలు నియమితులయ్యారు.