రాష్ట్ర హైకోర్టుకు కొత్తగా 12 మంది న్యాయమూర్తులను నియమించాలని సుప్రీం కోర్టు కొలీజియం కేంద్రానికి సిఫారసు చేసింది. వీరిలో జ్యుడీషియరీ నుంచి జీ అనుపమా చక్రవర్తి, ఎం గిరిజా ప్రియదర్శిని, సాంబశివరావునాయుడు, ఏ సంతోష్రెడ్డి, డాక్టర్ డీ నాగార్జున, న్యాయవాదులు.. కాసోజు సురేందర్, చాడ విజయ్భాసర్రెడ్డి, సూరేపల్లి నందా, ముమ్మినేని సుధీర్ కుమార్, జువ్వాడి శ్రీదేవి, మీర్జా సైఫీయుల్లా బేగ్, నాచరాజు వెంకట శ్రవణ్ కుమార్ ఉన్నారు. ప్రస్తుతం ఉన్న హైకోర్టు న్యాయమూర్తుల్లో ఆరుగురు మహిళలు ఉన్నారు. కొత్తగా నియమితులయ్యేవారిలో నలుగురు ఉన్నారు. మొత్తం 31 మందిలో 10 మంది.. అంటే మూడో వంతు న్యాయమూర్తులుగా మహిళలు ఉంటారు. ఇది హైకోర్టుల చరిత్రలోనే అరుదు. ఏ హైకోర్టులోనూ ఈ స్థాయిలో మహిళలు న్యాయమూర్తులుగా లేరు.
హైదరాబాద్, దుబ్బాక, నిర్మల్ అర్బన్, ఫిబ్రవరి 2: రాష్ట్ర హైకోర్టుకు కొత్తగా 12 మంది న్యాయమూర్తులను నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. మంగళవారం ఢిల్లీలో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అధ్యక్షతన సమావేశమైన కొలీజియం.. 12 మంది పేర్లను సిఫారసు చేసింది. ఇందులో ఐదుగురు జ్యుడీషియరీ నుంచి ఉండగా, ఏడుగురు న్యాయవాదులు ఉన్నారు. ప్రస్తుతం హైకోర్టులో ప్రధాన న్యాయమూర్తితో కలిపి 19 మంది న్యాయమూర్తులు ఉన్నారు. కొత్తవారితో ఆ సంఖ్య 31కి చేరుతుంది. ఏడుగురు న్యాయవాదులు, ఆరుగురు న్యాయాధికారుల పేర్లను హైకోర్టు కొలీజియం సిఫారసు చేయగా, ఒక న్యాయాధికారి మినహా మిగిలినవారందర్నీ కొలీజియం ఆమోదించింది. కాగా, ప్రస్తుతం ఉన్న హైకోర్టు న్యాయమూర్తుల్లో ఆరుగురు మహిళలు ఉన్నారు. కొత్తగా నియమితులయ్యేవారిలో నలుగురు మహిళా జడ్జీలు ఉన్నారు. మొత్తం 31 మందిలో 10 మంది.. అంటే మూడో వంతు న్యాయమూర్తులుగా మహిళలు ఉంటారు. ఇది హైకోర్టుల చరిత్రలోనే అరుదు. ఏ హైకోర్టులోనూ ఈ స్థాయిలో మహిళలు న్యాయమూర్తులుగా లేరు.
కొలీజియం ఆమోదించిన న్యాయాధికారులు:
1. వ్యాట్ ట్రిబ్యునల్ చైర్పర్సన్
జీ అనుపమా చక్రవర్తి
2. రాష్ట్ర లీగల్ సెల్ అథారిటీ సెక్రటరీ
ఎం గిరిజా ప్రియదర్శిని
3. హైదరాబాద్లో ప్రిన్సిపల్ స్పెషల్
జడ్జి సాంబశివరావునాయుడు
4. న్యాయ శాఖ కార్యదర్శి ఏ సంతోష్రెడ్డి
5. హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ డాక్టర్ డీ నాగార్జున
కొలీజియం ఆమోదించిన న్యాయవాదులు:
1. కాసోజు సురేందర్
2. చాడ విజయ్భాసర్రెడ్డి
3. సూరేపల్లి నందా
4. ముమ్మినేని సుధీర్ కుమార్
5. జువ్వాడి శ్రీదేవి (కుచడి శ్రీదేవి)
6. మీర్జా సైఫీయుల్లా బేగ్
7. నాచరాజు వెంకట శ్రవణ్ కుమార్
జీ అనుపమా చక్రవర్తి
ఏపీలోని శ్రీకాకుళం జిల్లా పాలకొండకు చెందిన అనుపమా చక్రవర్తి.. 1994లో ఎన్రోల్ అయ్యారు. 200608 వరకు అసిస్టెంట్ జీపీగా పనిచేశారు. 2008లో అడిషినల్ డిస్ట్రిక్ట్ జడ్జిగా విధుల్లో చేరారు. ఉమ్మడి ఏపీలో పలు చోట్ల పనిచేశారు. 2019-2020 సెప్టెంబర్ వరకు కరీంనగర్ జిల్లా ప్రిన్సిపల్ జడ్జిగా చేశారు. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ సభ్య కార్యదర్శిగా గత ఏడాది ఆగస్టు వరకు చేశారు. హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్గా, సహకార ట్రిబ్యునల్ చైర్పర్సన్గా పని చేశారు. ప్రస్తుతం వ్యాట్ ట్రిబ్యునల్ చైర్పర్సన్గా ఉన్నారు.
ఏనుగు సంతోష్ రెడ్డి
జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం జోగిన్పల్లికి చెందిన సంతోష్ రెడ్డి.. 1985లో న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యాక కరీంనగర్ జిల్లా కోర్టులో న్యాయవాద వృత్తిని ప్రారంభించారు. డిస్ట్రిక్ట్ మున్సిఫ్గా 1991లో ఎంపికయ్యారు. 2004లో సీనియర్ సివిల్ జడ్జిగా, 2010లో జిల్లా జడ్జిగా పదోన్నతి పొందారు. సిద్దిపేట అదనపు జిల్లా జడ్జిగా చేస్తుండగా ఉమ్మడి ఏపీలో 2013లో న్యాయ శాఖ కార్యదర్శి అయ్యారు. 2014 జూన్ 2 నుంచి 2017 జూన్ వరకు రంగారెడ్డి జిల్లా అదనపు జిల్లా జడ్జిగా చేశారు. 2019 నవంబర్లో రెండోసారి న్యాయశాఖ కార్యదర్శిగా నియమితులై ప్రస్తుతం ఆ పదవిలోనే కొనసాగుతున్నారు.
చాడ విజయభాసర్రెడ్డి
మెదక్ జిల్లా దుబ్బాకకు చెందిన చాడ విజయభాస్కర్రెడ్డి.. 1992 డిసెంబర్ 31న న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. 1999లో ఎన్ఐఆర్డీ, ఏపీ చిన్నతరహా పరిశ్రమల సంస్థలకు స్టాండింగ్ కౌన్సెల్గా పనిచేశారు. 20062009 మధ్య కాలంలో హైకోర్టులో కేంద్రం తరఫున అడిషినల్ స్టాండింగ్ కౌన్సెల్గా, 201015 కాలంలో వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్కు స్టాండింగ్ కౌన్సెల్గా చేశారు. 20142021 వరకు హైకోర్టులో తెలంగాణ ప్రభుత్వ న్యాయవాదిగా చేశారు.
జువ్వాడి శ్రీదేవి
1997 అక్టోబర్ 31న న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. 2004 అక్టోబర్ నుంచి 2008 ఫిబ్రవరి వరకు ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ అసిస్టెంట్ సెషన్స్ కోర్టులో అడిషినల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా చేశారు. హైకోర్టుకు ప్రాక్టీస్ మార్చాక 2014 జూలై 30 నుంచి 2017 నవంబర్ వరకు రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాదిగా చేశారు. ప్రస్తుతం హైకోర్టులో అడిషినల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా చేస్తున్నారు. ఈమె భర్త కూచాడి శ్రీహరిరావు టీఆర్ఎస్ పార్టీ నాయకుడు, న్యాయవాది కూడా.
మాటూరి గిరిజా ప్రియదర్శిని
ఏపీలోని విశాఖపట్టణానికి చెందిన గిరిజా ప్రియదర్శిని.. 1995లో లాయర్గా ఎన్రోల్ అయ్యారు. విశాఖ జిల్లా కోర్టులో ఏడేండ్లు ప్రాక్టీస్ చేశారు. 2008లో అదనపు జిల్లా జడ్జిగా బాధ్యతలు చేపట్టారు. ఖమ్మం ఫ్యామిలీ కోర్టులో మూడేండ్లు, విజయనగరం మొదటి అదనపు జిల్లా జడ్జిగా, నంద్యాలలో అదనపు జిల్లా జడ్జిగా పనిచేశారు. 2017లో ఒంగోలు జిల్లా కోర్టు చీఫ్గా పదోన్నతి పొందారు. ఆదిలాబాద్ జిల్లా కోర్టు చీఫ్ జడ్జిగా చేశారు. ఆ తర్వాత కరీంనగర్ జిల్లా కోర్టు చీఫ్ జడ్జిగా చేశారు. ప్రస్తుతం రాష్ట్ర లీగల్ సెల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీగా చేస్తున్నారు.
డాక్టర్ దేవరాజు నాగార్జున
వనపర్తికి చెందిన డాక్టర్ దేవరాజు నాగార్జున.. 1986లో లాయర్గా ఎన్రోల్ అయ్యారు. 1991లో జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికయ్యారు. 2004లో సీనియర్ సివిల్ జడ్జిగా పదోన్నతి వచ్చింది. ఏపీ పోలీస్ అకాడమీకి అసిస్టెంట్ డైరెక్టర్గా చేశారు. 2010లో జిల్లా జడ్జిగా పదోన్నతి లభించింది. 2015లో హైకోర్టు రిజిస్ట్రార్ (అడ్మినిస్ట్రేషన్) అయ్యారు. తర్వాత హైకోర్టు రిజిస్ట్రార్ (జ్యుడీషియల్), మధ్యలో కొద్ది రోజులు ఎంఎస్జేగా చేశారు. గతేడాది అక్టోబర్ 18 నుంచి హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్గా ఉన్నారు. జువైనల్ జస్టిస్ వంటివే కాకుండా అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ ఏర్పాటులో అత్యంత కీలకపాత్ర పోషించారు. గత ఏడాది డిసెంబర్లో జరిగిన సెంటర్ ప్రారంభోత్సవ వేడుకలో ఆయన సేవలను వేదికపై నుంచి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ కొనియాడటం గమనార్హం.
సూరేపల్లి నందా
1993 ఆగస్టు 4న లాయర్గా ఎన్రోల్ అయిన ఈమె.. 27 ఏండ్లుగా హైకోర్టు న్యాయవాదిగా పనిచేస్తున్నారు. నందా వాదించిన కేసుల్లో 64 తీర్పులు రిపోర్టు అయ్యాయి. ఏపీ లీగల్ సర్వీసెస్ అథారిటీ ప్యానల్ అడ్వొకేట్గా, కమిటీ సభ్యురాలిగా చేశారు. జిల్లాల్లోని లాయర్ల లీగల్ ఎయిడ్ ప్యానల్లో ఉన్నారు. బార్ కౌన్సిల్కు స్టాండింగ్ కౌన్సెల్గా, 200104లో ప్రభుత్వ సహాయ న్యాయవాదిగా చేశారు. 201015 వరకు కేంద్ర ప్రభుత్వ న్యాయవాదిగా చేశారు. పలు బ్యాంకులు, ఎన్ఐఆర్డీ, మహిళా కమిషన్కు స్టాండింగ్ కౌన్సెల్గా చేశారు. గత ఏడాది జూలై 3న సీనియర్ న్యాయవాదిగా పదోన్నతి లభించింది.
మీర్జా సైఫీయుల్లా బేగ్
2002 అక్టోబర్ 31న బార్ కౌన్సిల్లో ఎన్రోల్ అయ్యారు. మహబూబాబాద్లో తండ్రి మీర్జా ఇమాముల్లా బేగ్ భూస్వామి, హైకోర్టులో సీనియర్ న్యాయవాది. తాత కేఎఫ్ బాబా కూడా న్యాయవాది. వాళ్ల తర్వాత ఉమామహేశ్వర్రావు వద్ద కొంతకాలం పనిచేశారు. 17 ఏండ్లుగా స్వతంత్రంగా ప్రాక్టీస్ చేస్తున్నారు. హైకోర్టులో అన్ని తరహా కేసులను వాదించారు. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రకు, పలు ప్రైవేట్ కంపెనీలకు, విద్యాసంస్థలకు ప్యానల్ అడ్వొకేట్గా చేశారు. 2014 నుంచి 2020 వరకు తెలంగాణ వక్ఫ్ బోర్డుకు స్టాండింగ్ కౌన్సెల్గా చేశారు.
సాంబశివరావునాయుడు
ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురానికి చెందిన సాంబశివరావునాయుడు.. 1986లో క్రిమినల్ లాయర్ జానకిరామయ్య వద్ద జూనియర్గా చేరారు. 1991లో డిస్ట్రిక్ట్ మున్సిఫ్గా ఎంపికయ్యారు. జూనియర్ సివిల్ జడ్జి, సీనియర్ సివిల్ జడ్జి, అదనపు డిస్ట్రిక్ట్ జడ్జిగా హుజూరాబాద్, కరీంనగర్, వరంగల్, కొత్తగూడెం, తిరుపతిలో చేశారు. జిల్లా జడ్జిగా మహబూబ్నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టుల్లో పనిచేశారు. 2019 నుంచి ఎస్పీఈ అండ్ ఏసీబీ కేసులు విచారణ చేసే హైదరాబాద్లోని కోర్టులో ప్రిన్సిపల్ స్పెషల్ జడ్జిగా చేస్తున్నారు.
కాసోజు సురేందర్
మహబూబ్నగర్కు చెందిన ఈయన.. 1992లో ఎన్రోల్ అయ్యారు. 20052008 వరకు హైకోర్టులో కేంద్రం తరఫు అడిషినల్ స్టాండింగ్ కౌన్సెల్గా, 2010లో పీపీగా, సీబీఐ కౌన్సెల్గా చేశారు. 2013లో రెండోసారి సీబీఐ స్పెషల్ పీపీగా, జగన్ ఆస్తుల కేసులో సీబీఐ స్టాండింగ్ కౌన్సెల్గా చేశారు. హైకోర్టులో ఎన్ఐఏ కౌన్సెల్గా దిల్సుఖ్నగర్, గోకుల్చాట్, లుంబినీపార్ బాంబుపేలుడు కేసులను వాదించారు. ప్రస్తుతం నాలుగోసారి సీబీఐ స్పెషల్ పీపీగా చేస్తున్నారు. కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్కు, ఎన్ఐఏకు స్పెషల్ పీపీగా చేస్తున్నారు.
ముమ్మినేని సుధీర్ కుమార్
ఖమ్మం జిల్లాకు చెందిన సుధీర్ కుమార్ది వ్యవసాయ కుటుంబం. చర్లలో ఇంటర్ వరకు చదివారు. ఏలూరులోని సీఆర్రెడ్డి కాలేజీలో డిగ్రీ, నాందేడ్లోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేదర్ మరట్వాడ విశ్వవిద్యాలయం నుంచి ఎల్ఎల్బీ చేశారు. 1994లో న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. సీనియర్ న్యాయవాది ఎంఆర్కే దరి వద్ద జూనియర్గా చేశారు. అన్ని కోర్టుల్లోనూ న్యాయవాదిగా కేసులను వాదించారు.
నాచరాజు వెంకట శ్రవణ్ కుమార్
హైదరాబాద్లో 1967 ఆగస్టు 18న పుట్టారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు మనుమడు. పీవీ పెద్ద కూతురు శారద వెంకట కిషన్రావు చిన్న కుమారుడు. బీకాం, ఎంబీఏ, ఎల్ఎల్బీ, నల్సార్లో సైబర్ లాలో పీజీ డిప్లొమా చేశారు. 2005 నవంబర్ 17న ఎన్రోల్ అయ్యారు. రావు అండ్ కో లాయర్స్ ఆఫీసులో జూనియర్గా చేరారు. కింది కోర్టులు, హైకోర్టు, నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్స్లో కేసులు వాదించారు. న్యాయవాదిగా సమర్థుడనే పేరుంది. నీటిపారుదల శాఖ వ్యవహారాల ప్రభుత్వ న్యాయవాదిగా చేస్తున్నారు.