జబల్పూర్: ‘మహాయజ్ఞం’లో భాగంగా ఈ నెల 9న మధ్యప్రదేశ్లోని సత్దేవ్ గ్రామం వద్ద నర్మద నదిలోకి 11 వేల లీటర్ల పాలు కలపడంపై పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. అంత ఎక్కువ పరిమాణంలో ఉండే సేంద్రీయ పదార్థాలు నీటిలో కరిగి ఉన్న ఆక్సిజన్ను క్షీణింపచేసి, నది జీవావరణ వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతాయని తెలిపారు. మతాచారంలో భాగంగా నది శుద్దీకరణ పేరుతో కొందరు మత గురువులు పాలను నదిలోకి వదిలారు. దీనిపై పర్యావరణ వేత్త అజయ్ దూబే స్పందిస్తూ… ‘ఈ చర్య తాగునీటి కోసం నదిపై ఆధారపడిన స్థానిక సమాజాలపై ప్రభావం చూపుతుంది.
జలచరాలకు, పెంపుడు జంతువులకు కూడా ముప్పు కలిగిస్తుంది’ అని పేర్కొన్నారు. మత పరమైన సమర్పణలు ప్రతీకాత్మకంగా, ఆలోచనాత్మకంగా ఉండాలని నొక్కి చెప్పారు. అన్ని వేల లీటర్ల పాలు ప్రభావంతమైన సేంద్రీయ కాలుష్య కారకంగా పని చేస్తాయని మరో పర్యావరణ వేత్త సుభాశ్ పాండే తెలిపారు. 1,312 కిలోమీటర్ల మేర ప్రవహించే నర్మద నది గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో కీలకమైన తాగు, సాగునీటి వనరుగా ఉన్నది.