హైదరాబాద్, ఫిబ్రవరి 21: దేశీయ పొదుపులో అధిక శాతాన్ని బీమా దిగ్గజం ఎల్ఐసీ ఆకర్షిస్తున్నదని స్విస్ బ్రోకింగ్ సంస్థ యూబీఎస్ ఒక నివేదికలో తెలిపింది. దేశంలో జరిగే ప్రతీ రూ.100 గృహ పొదుపులో రూ.10 ఎల్ఐసీ వద్దకే పాలసీల రూపంలో వెళుతున్నదని, బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ.. డిపాజిట్లలోకి ఆకర్షిస్తున్న 8 శాతం పొదుపుకంటే ఇది ఎక్కువని యూబీఎస్ పేర్కొంది. గృహ పొదుపుతో పాటు ప్రభుత్వ బాండ్లు, ఈక్విటీలు ఎల్ఐసీ వద్దనే అధికంగా ఉన్నాయన్నది. ప్రభుత్వం జారీచేసిన బాండ్లలో (జీ-సెక్లు) 19 శాతం ఎల్ఐసీ చెంతనే ఉన్నాయని, వీటిని కలిగివున్న సంస్థల్లో ఎల్ఐసీదే అగ్రస్థానమని, 17 శాతం బాండ్లతో రిజర్వ్ బ్యాంక్ ద్వితీయస్థానంలో ఉందని స్విస్ సంస్థ వివరించింది. అయితే ప్రభుత్వ బాండ్లు వాణిజ్య బ్యాంక్లన్నింటివద్ద కలిపి 40 శాతం ఉన్నాయి. ఇతర బీమా కంపెనీల చెంత 5 శాతం ప్రభుత్వ బాండ్లున్నాయి. అలాగే దేశంలో అతిపెద్ద సంస్థాగత ఇన్వెస్టర్ ఎల్ఐసీయేనని, దాదాపు 3 ట్రిలియన్ డాలర్ల దేశీ ఈక్విటీ మార్కెట్లో ఈ సంస్థ నిర్వహణలో ఉన్న ఆస్తుల విలువ (ఎన్యూఎం) 520 బిలియన్ డాలర్లని యూబీఎస్ తెలిపింది. దేశంలోని అన్ని ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ వద్దనున్న ఆస్తుల మొత్తంలో సగానికంటే అధికంగా ఎల్ఐసీ వద్దనున్నట్టు పేర్కొంది. 2021 డిసెంబర్ చివరినాటికి ఎల్ఐసీ వద్ద 10 శాతం మేర రిలయన్స్ షేర్లున్నాయి.