హైదరాబాద్, జూలై 3(నమస్తే తెలంగాణ) : నాలుగు రోజుల్లోనే రూ. 6590.37 కోట్ల రైతుభరోసా నిధులను రైతుల ఖాతాల్లో జమ చేసినట్టు మంత్రి తుమ్మల తెలిపారు. నాలుగో విడతలో 4 నుంచి 5 ఎకరాల వరకు సాగుభూమి కలిగిన రైతుల ఖాతాల్లో రూ. 1188 కోట్లను నేరుగా జమ చేసినట్టు వెల్లడించారు. ఈ విడతలో 4.41 లక్షల మంది రైతులు రైతుభరోసా సాయాన్ని పొందారని మంత్రి తెలిపారు. ఇప్పటివరకు రైతుభరోసా పథకం కింద మొత్తం 65.76 లక్షల మంది రైతుల ఖాతాలకు ప్రభుత్వం సాయం విడుదల చేసినట్టు వెల్లడించారు.
హైదరాబాద్, జూలై 3 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో ప్రైవేటు ఫర్టిలిటీ సెంటర్లు నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ హెచ్చరించారు. శుక్రవారం సచివాలయంలో ఫర్టిలిటీ వైద్య సేవల విస్తరణ, నియంత్రణపై ఉన్నతాధికారులతో మాట్లాడారు. ఫర్టిలిటీ సెంటర్లు పేషెంట్లకు ఇస్తున్న మెడిసిన్, ఇంజెక్షన్లు, వాటి తయారీ కంపెనీలు, ఎంఆర్పీ తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించాలని అధికారులకు సూచించారు. ప్రైవేట్ సెంటర్ల నుంచి రిపోర్టులు తీసుకోవాలని, పోర్టల్లో వివరాలు అప్లోడ్ చేయని సెంటర్లపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.