హైదరాబాద్, జనవరి 25 : ఇరవై మంది విద్యార్థులకు ఒక మూత్రశాల, 40 మందికి ఒక మరుగుదొడ్డి.. ఇవి మన ఊరు – మన బడి పథకంలో భాగంగా నిర్మించనున్న టాయిలెట్లు. ఈ పథకంలో భాగంగా రూ.200 కోట్లతో ఏడువేల టాయిలెట్ కాంప్లెక్స్లను నిర్మించనున్నారు. పాఠశాల విద్యాశాఖ అధికారులు తొలి విడతలో ఈ విద్యాసంవత్సరమే వీటిని నిర్మించేలా ప్రతిపాదనలు రూపొందించారు. మన ఊరు-మన బడి పథకంలో మొత్తం 12 అంశాల్లో రూ.3,497.62 కోట్ల వ్యయంతో 9,123 స్కూళ్లను తొలి విడతలో అభివృద్ధి చేయనున్న విషయం తెలిసిందే. ఇందులో బాలబాలికలకు వేర్వేరుగా టాయిలెట్లను నిర్మించాలని నిర్ణయించారు. స్కూళ్లల్లో వందశాతం టాయిలెట్లను నిర్మించాలని, వాటిలో రన్నింగ్వాటర్ సౌకర్యం ఉండాలని ప్రతిపాదించారు. దీంట్లో భాగంగా ఒక్కో స్కూల్లో బాలురకు నాలుగు, బాలికలకు నాలుగు చొప్పున టాయిలెట్లను నిర్మించాలని అధికారులు ప్రతిపాదనలు తయారుచేశారు. ఇప్పటికే కొన్ని స్కూళ్లల్లో టాయిలెట్లు ఉండగా, వాటిని మినహాయించారు. ఇవిపోను కొత్తగా మరో ఏడు వేల టాయిలెట్ కాంప్లెక్స్లను నిర్మించాలని అధికారులు లెక్క తేల్చారు.
20 మంది విద్యార్థులకు ఒకటి చొప్పున మూత్రశాలలు. 40 మంది విద్యార్థులకు ఒక మరుగుదొడ్డిని నిర్మిస్తారు. బాల, బాలికలకు వేర్వేరుగా నాలుగు చొప్పున వెస్ట్రన్ టాయిలెట్లు ఉంటాయి. వీటికి ఎల్లప్పుడూ నీటి వసతి ఉండేలా ఏర్పాట్లు ఉంటాయి. ఇది వరకే ఉన్న టాయిలెట్లల్లో పాతవాటిని తొలగించి, వెస్ట్రన్ టాయిలెట్లను అమరుస్తారు. గోడలకు టైల్స్ బిగిస్తారు. టాయిలెట్లకు ఇనుపడోర్ల స్థానంలో వాటర్ఫ్రూఫ్ పీవీసీ డోర్లను అమరుస్తారు. టాయిలెట్లలో నిరంతరం విద్యుత్తు సరఫరా ఉండేలా కొత్త విద్యుత్తు కనెక్షన్, స్విచ్బోర్డులను ఏర్పాటుచేస్తారు. ఇన్ఫెక్షన్లు సోకకుండా ఉండేందుకు టాయిలెట్లకు సమీపంలోనే హ్యాండ్వాష్ చేసుకునేందుకు సింక్, వాష్బేసిన్లను ఏర్పాటుచేస్తారు.