హైదరాబాద్, నవంబర్12 (నమస్తే తెలంగాణ): నదుల అనుసంధానం ప్రాజెక్టుల్లో తెలంగాణ నీటి హక్కులకు భంగం వాటిల్లకుండా చూడాలని రాష్ట్ర ప్రతినిధులు కేంద్రానికి తేల్చిచెప్పారు. ఢిల్లీలోని విజ్ఞాన్భవన్లో జాతీయ జల అభివృద్ధి సంస్థ (ఎన్డబ్ల్యూడీఏ) వార్షిక సమావేశం శుక్రవారం కొనసాగింది. ఈ సమావేశంలో గోదావరి-కావేరి అనుసంధాన ప్రాజెక్టుపై ఆయా రాష్ర్టాల అభిప్రాయాన్ని కేంద్ర జల్శక్తిశాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం తరపున సీఎం ఓఎస్డీ శ్రీధర్రావు దేశ్పాండే, ఈఎన్సీ హరిరాం మాట్లాడారు. ముందుగా గోదావరిలో నీటి లభ్యతపై కచ్చితమైన గణాంకాలను సేకరించాలని సూచించారు. ఆ తరువాతనే లింక్ ప్రాజెక్టుపై ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, తెలంగాణ రాష్ర్టాల అంగీకారం తీసుకొని ముందుకు సాగాలని చెప్పారు. తెలంగాణకు గోదావరి జలాల్లో 954 టీఎంసీల కేటాయింపులు ఉన్నాయని, 758 టీఎంసీల వినియోగానికి ప్రాజెక్టులను సిద్ధం చేసుకున్నామని వెల్లడించారు. మరో 148 టీఎంసీల నీటి వినియోగానికిగాను వివిధ ప్రాజెక్టులను రూపొందించుకున్నామని, డీపీఆర్లను ఇప్పటికే అందజేశామని, వాటిని ఆమోదించాలని విజ్ఞప్తిచేశారు.
నదుల అనుంధానానికి అన్ని రాష్ర్టాలు సహకరించాలని మంత్రి షెకావత్ విజ్ఞప్తిచేశారు. ఎన్డబ్ల్యూడీఏ సమావేశంలో అంతకుముందు మంత్రి మాట్లాడుతూ.. వాతావరణ మార్పుల వల్ల దేశంలో కొన్నిచోట్ల వరదలు సంభవిస్తుండగా, మరికొన్ని చోట్ల కరువు తాండవిస్తున్నదని చెప్పారు. ఈ నేపథ్యంలో నీటిని అధికమొత్తంలో లభ్యత ఉన్న చోటు నుంచి కరువు ప్రాంతాలకు తరలించాల్సి ఉందని, అందులో భాగంగానే నదుల అనుసంధాన ప్రాజెక్టు అని చెప్పారు. రాష్ర్టాలు జాతీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని నదుల అనుసంధానానికి సహకరించాలని కోరారు.
17న జీఆర్ఎంబీ సబ్కమిటీ మీటింగ్ గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జీఆర్ఎంబీ) సబ్కమిటీ 5వ సమావేశాన్ని 17వ తేదీన జలసౌధలో నిర్వహించనున్నారు. ఈ మేరకు తెలంగాణ, ఏపీ రాష్ర్టాలతో పాటు, కమిటీ మెంబర్లకు జీఆర్ఎంబీ మెంబర్ సెక్రటరీ, సబ్కమిటీ కన్వీనర్ బీపీ పాండే శుక్రవారం లేఖలు రాశారు.
జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టులకు సంబంధించిన పూర్తి వివరాలను వెంటనే అందజేయాలని తెలంగాణ, ఏపీ రాష్ర్టాలకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) సూచించింది. ఈ మేరకు తెలంగాణ సాగునీటి పారుదలశాఖ ఈఎన్సీ మురళీధర్, ఏపీ నీటివనరులశాఖ ఈఎన్సీ నారాయణరెడ్డికి కేఆర్ఎంబీ మెంబర్ సెక్రటరీ డీఎం రాయ్పురే శుక్రవారం లేఖలను రాశారు. గెజిట్ను అమలు చేయడంలో భాగంగా ఆయా ప్రాజెక్టుల సమాచారాన్ని అందివ్వాలని సూచించారు. ప్రాజెక్టుల స్పిల్వే, కెనాల్ హెడ్రెగ్యులేటర్, ఔట్లెట్స్, మొత్తంగా
ఎన్ని గేట్లు ఉన్నాయి, వాటి ఆపరేషనల్ వరుసక్రమం ఇవ్వాలని కోరారు. అదేవిధంగా ఆయా ప్రాజెక్టులకు వచ్చిన వరదకు సంబంధించిన హైడ్రోగాఫ్లను, 30 ఏండ్లలో ఆయా రిజర్వాయర్ల కింద వినియోగించిన నీటి లెక్కలను అందించాలని ఆదేశించారు. ముందుగా నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల సమాచారాన్ని అందించాలని
ఇరు రాష్ర్టాలకు కేఆర్ఎంబీ విజ్ఞప్తిచేసింది.