చెన్నై: జమిలి ఎన్నికలు, పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజన ప్రతిపాదనలను వ్యతిరేకిస్తూ తమిళనాడు శాసన సభ బుధవారం రెండు తీర్మానాలను ఆమోదించింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మాట్లాడుతూ, జనాభా లెక్కల ఆధారంగా 2026 తర్వాత చేపట్టాలనుకుంటున్న పార్లమెంటరీ నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను చేపట్టవద్దని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ ప్రాతిపదికపై నియోజకవర్గాలను విభజించడం వల్ల దక్షిణాది రాష్ర్టాల ప్రాతినిధ్యం పార్లమెంటులో తగ్గిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఇది దక్షిణ భారత దేశం మెడపై వేలాడే కత్తి అని అభివర్ణించారు. అనివార్య కారణాల వల్ల జనాభా ప్రాతిపదికన పార్లమెంటులో స్థానాల సంఖ్యను పెంచవలసి వస్తే, రాష్ర్టాల శాసన సభలు, పార్లమెంటు ఉభయ సభల్లోని నియోజకవర్గాల మధ్య ప్రస్తుతం ఉన్న నిష్పత్తిని కొనసాగించాలని కోరారు. గడచిన 50 ఏళ్ల నుంచి వివిధ సాంఘిక, ఆర్థిక అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న తమిళనాడు వంటి రాష్ర్టాలను శిక్షించవద్దని ఈ తీర్మానంలో కోరారు.
‘ఒక దేశం-ఒకేసారి ఎన్నికలు’ విధానానికి వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన తీర్మానంపై స్టాలిన్ మాట్లాడుతూ, జమిలి ఎన్నికలను నిర్వహించడం ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమని, ఆచరణ సాధ్యం కాదని, రాజ్యాంగంలో దీని గురించి చెప్పలేదని అన్నారు. దీనిని అమలు చేయవద్దని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. భారత దేశం వంటి విశాలమైన దేశంలో ప్రజల సమస్యలను దృష్టిలో ఉంచుకుని, రాష్ర్టాల శాసన సభలకు వేర్వేరు సమయాల్లో ఎన్నికలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.