ఖలీల్వాడి, జూలై 24 : జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో ఉన్న రూం నంబర్ జీ-94లో సాయంకాలం ఓపీని శనివారం ప్రారంభించారు. వానకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా రాష్ట్రప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా సాయంత్రం సైతం ఓపీ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇప్పటికే నిర్వహిస్తున్న ఉదయం ఓపీకి సుమారు 600 మంది రోగులు వస్తున్నారని దవాఖాన అధికారులు తెలిపారు.
మొదటిరోజు సాయంత్రం ఓపీకి 53 మంది రోగులు రాగా.. వారికి మందులను అందజేసి పలు సూచనలు చేశారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు ఓపీ సేవలు కొనసాగుతున్నాయి. జనరల్ మెడిసిన్, ఆర్థో, సర్జరీ, గైనకాలజీ, పిడియాట్రిక్ తదితర విభాగాల వైద్యులు అందుబాటులో ఉండి సేవలందిస్తున్నారు. వీటితో పాటు ఇంటింటి సర్వే, మలేరియా, డెంగీ తదితర వ్యాధులు ప్రబలకుండా వైద్యారోగ్య అధికారులు చర్యలు చేపట్టారు. దవాఖానలో సమస్యలు తలెత్తకుండా ఎమ్మెల్సీ కవిత, మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, కలెక్టర్ నారాయణరెడ్డి చర్యలు చేపడుతున్నారు.