హైదరాబాద్, నవంబర్ 22: హైదరాబాద్ కేంద్రస్థానంగా కార్యకలాపాలు అందిస్తున్న ఆజాద్ ఇంజినీరింగ్ రాష్ట్రంలో మరో ప్లాంట్ను ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే రెండు ప్లాంట్లను ఏర్పాటు చేసిన సంస్థ.. తాజాగా రూ.500 కోట్లతో భాగ్యనగరానికి సమీపంలోని తునికి బొల్లారం వద్ద నిర్మించతలపెట్టిన ప్లాంట్కు సోమవారం శంకుస్థాపన చేసింది. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా 30 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తున్న ఈ ప్లాంట్ తొలి దశ వచ్చే ఏడాది జూలై నాటికి అందుబాటులోకి రానున్నది. 23.45 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ ప్లాంట్ ప్రస్తుతం ఉన్న రెండు ప్లాంట్ల సామర్థ్యం కంటే పది రెట్లు అధికమని కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ రాకేశ్ చొప్దార్ తెలిపారు. ఈ నూతన ప్లాంట్తో మరో వెయ్యి మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయన్నారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ..మూడో ప్లాంట్ తొలి దశ పూర్తైన తర్వాత పటాన్చెరు వద్ద రూ.500 కోట్ల నుంచి రూ.750 కోట్ల పెట్టుబడితో నాలుగో యూనిట్ను నెలకొల్పబోతున్నట్లు ప్రకటించారు. దీంతో మొత్తంగా ఈ నాలుగు యూనిట్లు పూర్తైన తర్వాత సిబ్బంది సంఖ్య 3 వేల వరకు చేరుకోనున్నది. ప్రస్తుతం ఉన్న రెండు యూనిట్లలో వెయ్యి మంది పనిచేస్తున్నారు. అలాగే దుండిగల్ వద్ద డిఫెన్స్ అండ్ ఆయిల్ అండ్ గ్యాస్ విభాగం కోసం రూ.500-700 కోట్లతో ఏర్పాటు చేస్తున్న మూడో యూనిట్లో 400 మంది పనిచేయనున్నారు.
వచ్చే ఏడాది ఐపీవోకి!
ఆర్డర్లు ఆకట్టుకోవడంలో దూసుకుపోతున్న ఆజాద్ ఇంజినీరింగ్ స్టాక్ మార్కెట్లోకి లిస్ట్ కావడానికి సిద్ధమవుతున్నది. వచ్చే ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో ఐపీవోకి వచ్చే అవకాశం ఉన్నదని రాకేశ్ సంకేతలిచ్చారు. ఈ ఐపీవో ద్వారా రూ.1,200 కోట్ల నుంచి రూ.1,500 కోట్ల వరకు నిధులు సమీకరించే ఆలోచనలో సంస్థ ఉన్నదన్నారు. వ్యాపార విస్తరణకోసం అవసరమైన నిధుల్లో ఇప్పటికే 20 మిలియన్ డాలర్లు సేకరించినట్లు, రెండో దఫా 110-150 మిలియన్ డాలర్ల వరకు సమీకరించే అవకాశం ఉన్నదన్నారు. ఈ నిధులను ఐపీవో లేదా ప్రైవేట్ ఈక్విటీల ద్వారా సమీకరించాలనుకుంటున్నట్లు ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
ఐదేండ్లలో రూ.2,500 కోట్ల టర్నోవర్
వచ్చే ఐదేండ్లలో రూ.2,500 కోట్ల టర్నోవర్ లక్ష్యంగా పెట్టుకున్నది సంస్థ. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.210 కోట్లు, వచ్చే ఏడాది రూ.350 కోట్ల టర్నోవర్ ఆశిస్తున్నట్లు ఆయన చెప్పారు. కంపెనీకి వచ్చిన టర్నోవర్లో 85 శాతం విదేశాల నుంచి సమకూరుతుండగా, కేవలం 15 శాతం భారత్ నుంచి లభిస్తున్నదని పేర్కొన్నారు. అలాగే కంపెనీ చేతిలో రూ.2,500 కోట్ల విలువైన ఆర్డర్లు ఉన్నాయని, వీటిలో అత్యధికంగా ఎనర్జీ, విమానయాన రంగానికి సంబంధించినవని చెప్పారు. ఇటీవల ఎయిర్బస్తో కుదుర్చుకున్న సూపర్క్రిటికల్ రొటేటింగ్ విడిభాగాల ఆర్డర్ను వచ్చే ఫిబ్రవరి నుంచి సరఫరా చేయబోతున్నది.