పటాన్చెరు, డిసెంబర్ 16 : అంతర్జాతీయ ప్రమాణాలతో విదేశాలకు తీసిపోని రోడ్లను నిర్మిస్తున్నామని ఐటీ, భారీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. 340 కిలోమీటర్ల మేర రీజనల్ రింగు రోడ్డును హైదరాబాద్ ఔటర్ రింగు రోడ్డు కన్నా మరింత మెరుగ్గా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. గురువారం సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ముత్తంగి గ్రామ పరిధిలోని పటాన్చెరు ఔటర్ రింగ్రోడ్డు జంక్షన్పై ఏర్పాటైన ఎల్ఈడీ లైట్లను మంత్రి కేటీఆర్, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి, చేవెళ్ల ఎంపీ రంజిత్రెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్రాజు, పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి, జడ్పీ చైర్పర్సన్లు మంజుశ్రీజైపాల్రెడ్డి, అనిత హరినాథ్రెడ్డితో కలిసి ప్రారంభించారు.
కార్యక్రమంలో భాగంగా విరజిమ్మిన పటాకుల వెలుగుల్లో ఔటర్రింగ్ రోడ్డు మిరుమిట్లు గొలుపుతూ అందరినీ ఆకట్టుకున్నది. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ఔటర్పై 100 కోట్ల వ్యయంతో 136 కిలోమీటర్ల మేర కొత్తగా ఎల్ఈడీ లైట్లను అమర్చినట్టు తెలిపారు. మరో 270.5 కిలోమీటర్ల మేర సర్వీసురోడ్డు, ఔటర్ రోడ్డును కూడా అభివృద్ధి చేశామని చెప్పారు. ఓఆర్ఆర్పై ప్రయాణం సురక్షితంగా, సౌకర్యవంతంగా ఉండేలా అనేక మౌలిక వసతులు కల్పించామని తెలిపారు.
నగరంలో అంతర్జాతీయ ప్రమాణాలతో విదేశాలకు తీసిపోని విధంగా రోడ్లను నిర్మిస్తున్నామని కేటీఆర్ ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. త్వరలో నిర్మితం కానున్న 340 కిలోమీటర్ల పొడవైన రీజనల్ రింగ్ రోడ్డును ఔటర్కన్నా మెరుగ్గా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. అభివృద్ధి విషయంలో సీఎం కేసీఆర్ రాజీపడరని, ఎంత ఖర్చైనా వెనక్కి తగ్గరని చెప్పారు. ఔటర్ రింగురోడ్డుకు హెచ్ఎండీఏ అధికారులు చక్కటి హంగులు ఏర్పాటు చేశారంటూ మంత్రి అభినందించారు. దేశంలో ఉన్న అన్ని మెట్రో నగరాలకంటే హైదరాబాద్ ఔటరే పెద్దదని తెలిపారు. ఔటర్ రింగు రోడ్డు అందుబాటులోకి రావడంతో 80 వేల ఎకరాల స్థలం అందుబాటులోకి వచ్చి కొత్త పరిశ్రమలు వచ్చాయని మంత్రి చెప్పారు. ఐఏఎస్ అధికారి సంతోష్ నేతృత్వంలో హైదరాబాద్ గ్రోత్ కారిడార్ను ముందుకు తీసుకుని వెళ్తున్నామని , అందుకు అవసరమైన మార్కెటింగ్ చేసేందుకు ఓఆర్ఆర్ ఉపయోగపడుతుందన్నారు.