కరోనా రక్కసితో ఎన్నో కుటుంబాలు చిన్నాభిన్నమయ్యాయి. నిరుపేదల పరిస్థితి ఇక చెప్పాల్సిన అవసరం లేదు. రొక్కాడితే కాని డొక్కాడని బడుగు జీవుల పిల్లలు అర్ధాకలితో అలమటించారు. అటు స్కూల్లో మధ్యాహ్న భోజనం లేక.. ఇటు తల్లిదండ్రులకు ఉపాధి దొరక్క, ఆకలితో వేలాది మంది పిల్లలు బుక్కెడు బువ్వకోసం ఎన్నో పాట్లుపడ్డారు. ఇలాంటి పరిస్థితుల్లో దాదాపు 17 నెలల సుదీర్ఘ విరామం అనంతరం పాఠశాలలు తెరుచుకోవడంతో విద్యార్థుల ముఖాల్లో ఆనందం వెలిగిపోయింది. . స్కూళ్లను తెరవడంతో పాటు మధ్యాహ్న భోజనం కూడా పక్కాగా అందించాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశించిన సంగతి తెలిసిందే. దీంతో స్కూళ్లు మొదలైన తొలి రోజు నుంచే మధ్యాహ్న భోజన పథకాన్ని పక్కాగా అమలు చేశారు. దీంతో సర్కారు బడుల్లో పిల్లలు కడుపు నిండా భోజనం చేసి క్లాసులకు హాజరయ్యారు.