హైదరాబాద్, జనవరి 11 : ఉత్తర తెలంగాణలో వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది. కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, ఆదిలాబాద్, కుమ్రంభీమ్ ఆసిఫాబాద్, నిజామాబాద్, కామారెడ్డి, వరంగల్ తదితర జిల్లాల్లో మంగళవారం సాయంత్రం గంటకుపైగా భారీ వర్షం కురిసిం ది. కరీంనగర్ జిల్లాకేంద్రంలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో నగరంలోని గీతభవన్ చౌరస్తాలో ఏర్పాటుచేసిన శ్రీరాముడి పట్టాభిషేకం కటౌట్ కుప్పకూలింది. పలు మండలాల్లో వడగండ్ల వానతో మక్క, పల్లి, పత్తి పంటలకు కొంతమేర నష్టంవాటిల్లింది. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలంలో రాళ్ల వానకు మక్క పెరళ్లు నేలకొరిగాయి. జగిత్యాల, పెద్దపల్లి జిల్లాలో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మం డలం కొండపల్లి, పెంచికల్పేట్ మండలం లోడ్పల్లి, కొండపల్లిలో వడగండ్లు పడ్డాయి. పెంచికల్పేట్ రహదారిపై చెట్లు విరిగి పడటంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. ఉమ్మడి నిజామాబాద్, వరంగల్ జిల్లాల్లోని పలుచోట్ల భారీ వర్షం కురిసింది. మంగళవారం రాత్రి గ్రేటర్ హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది.
నల్లబెల్లిలో 13.8 సెంటీమీటర్ల వాన
రాష్ట్రంలో అత్యధికంగా వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలో 13.8 సెంటీమీటర్ల వర్షం కురిసింది. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం తాడికల్లో 6.08, మానకొండూర్ మండలం ఈదులగట్టేపల్లిలో 5.68, కరీంనగర్ పట్టణంలో 5.25 సెంటీమీటర్ల వర్షం కురిసినట్టు టీఎస్డీపీఎస్ తెలిపింది.
నేడు, రేపు వానలు..
ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక నుంచి ఉత్తర మధ్య మహారాష్ట్ర వరకు సోమవారం ఏర్పడిన ఉపరితల ద్రోణి స్థిరంగా కొనసాగుతున్నదని, మంగళవారం మరో ఉపరితల ద్రోణి కొంకణ్ పరిసర ప్రాంతాల నుంచి ఝార్ఖండ్ వరకు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వద్ద ఏర్పడిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొన్నది. దీని ప్రభావంతో బుధ, గురువారాల్లో పలుచోట్ల ఉరుములు, మెరుపులతోపాటు వడగండ్లతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని తెలిపింది.