న్యూఢిల్లీ: రోడ్డు ప్రమాదంలో మరణించిన జొమాటో డెలివరీ వ్యక్తి కుటుంబానికి ఆ సంస్థ పది లక్షల ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది. ఢిల్లీకి చెందిన జొమాటో ఫుడ్ డెలివరీ మ్యాన్ సలీల్ త్రిపాఠి బైక్ను, మద్యం మత్తులో ఉన్న పోలీస్ కానిస్టేబుల్ తన వాహనంతో ఢీకొట్టాడు. శనివారం రాత్రి జరిగిన ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన సలీల్ త్రిపాఠిని ఆసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. కాగా, ప్రమాదానికి కారణమైన కానిస్టేబుల్ మహేంద్రను పోలీసులు అరెస్ట్ చేశారు.
మరోవైపు జొమాటో ఫౌండర్ దీపిందర్ గోయల్, దీనిపై గురువారం స్పందించారు. ‘మా డెలివరీ భాగస్వామి సలీల్ త్రిపాఠి దురదృష్టవశాత్తూ రోడ్డు ప్రమాదంలో మరణించినందుకు మేము చాలా బాధపడ్డాం. ఆ కుటుంబానికి అన్ని రకాలుగా సహాయాన్ని అందించేందుకు ప్రయత్నిస్తున్నాం’ అని ట్వీట్ చేశారు. ప్రమాదం జరిగిన రాత్రి నుండి తమ బృందం కుటుంబంతో కలిసి ఆసుపత్రిలో ఉందని, కుటుంబానికి 10 లక్షల బీమా గ్రాంట్తో సహాయం చేస్తున్నామని తెలిపారు.
అలాగే సలీల్ త్రిపాఠి అంత్యక్రియలకు సంబంధించిన ఖర్చులతో సహా కుటుంబానికి కొన్ని ఖర్చులను భరించడంలో తమ బృందం ఇప్పటికే సహాయం చేసిందని జొమాటో పేర్కొంది. బాధితుడి భార్య కోరుకుంటే ఆమెకు ఉద్యోగం ఇస్తామని కూడా హామీ ఇచ్చింది. బాధిత కుటుంబానికి భవిష్యత్తు ఆధారం కోసం జొమాటో ఉద్యోగులంతా రూ.12 లక్షల మేర కలెక్ట్ చేస్తున్నట్లు ప్రకటించింది.
కాగా, భర్త మరణంతో ‘నా భవిష్యత్తు చీకటి అయ్యింది. నా భర్తకు న్యాయం చేయండి’ అంటూ సుచేతా త్రిపాఠి బుధవారం ట్వీట్ చేశారు. పదేండ్ల కుమారుడి భవిష్యత్తుపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ట్వీట్కు పలువురు స్పందించారు. ఆ కుటుంబానికి అండగా నిలిచేందుకు ముందుకు వచ్చారు. సినీ నిర్మాత మనీష్ ముంద్రా రూ.4 లక్షలను ఆమెకు మంగళవారం అందజేశారు.
మరోవైపు త్రిపాఠి కుటుంబానికి మద్దతుగా రూ.15 లక్షలు సేకరించాలన్న లక్ష్యంతో కెట్టో ద్వారా క్రౌడ్ ఫండింగ్ డ్రైవ్ చేపట్టారు. ఈ ఆన్లైన్ మద్దతు కూడా అంచనాలను మించింది. గురువారం మధ్యాహ్నం నాటికి రూ.7.75 లక్షల మేర నిధులు సమకూరాయి.
We are deeply aggrieved by the death of our delivery partner Salil Tripathi in an unfortunate road incident. We are extending all possible support to help the family get through this – pic.twitter.com/yJOUDsPpet
— Deepinder Goyal (@deepigoyal) January 13, 2022