ధర్మశాల, అక్టోబర్ 29: త్వరలో జరుగుతున్న హిమాచల్ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కేంద్ర ప్రభుత్వం త్రివిధ దళాల్లో నియామకాలకు సంబంధించి తీసుకొచ్చిన అగ్నిపథ్ స్కీమ్ కీలక ఎన్నికల అంశంగా మారనున్నది. ఈ పథకంపై తీవ్ర అసంతృప్తిగా ఉన్న యువత బీజేపీకి గట్టి బుద్ధి చెప్పనున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సైన్యంలో హిమాచల్ప్రదేశ్ నుంచి గణనీయమైన ప్రాతినిథ్యం ఉన్నది. ప్రస్తుతం త్రివిధ దళాల్లో పనిచేస్తున్న వారు లేదా మాజీ సైనికులు దాదాపు 2.8 లక్షల మంది ఉంటారని అంచనా. వీరిలో ప్రధానంగా పంజాబ్ను ఆనుకొని ఉండే పశ్చిమ జిల్లాలు కంగ్రా, ఉనా, హమీర్పూర్లలో 80 శాతం ఉంటారు. ఈ నేపథ్యంలో సహజంగానే ఈ ఆర్మీ ప్రభావం ఇక్కడి యువతపై ఉంటుంది.
తమ కలలను నాశనం చేస్తూ మోదీ సర్కార్ తీసుకొచ్చిన అగ్నిపథ్పై స్థానిక యువత ఆగ్రహంగా ఉన్నారు. జూన్లో ధర్మశాలలో ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా యువకులు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. కంగ్రా జిల్లా గగ్గల్ ఎయిర్పోర్టు సమీపంలోని పటాన్కోట్-మండి హైవే దిగ్బంధించారు. ఈ ఘటనకు సంబంధించి 300 మందిని పోలీసులు అరెస్టు చేశారు.
హిమాచల్లో ఉద్యోగ అవకాశాలు తక్కువగా ఉన్న నేపథ్యంలో రాష్ట్ర యువత ఎక్కువగా సైన్యంలో చేరేందుకు ఆసక్తి చూపుతుంటారు. అయితే, అగ్నిపథ్తో యువత ఆశలు అడియాసలు అయ్యాయని కంగ్రా జిల్లా గగ్గల్కు చెందిన క్రిష్ణన్దేవ్ రానా తెలిపారు. అగ్నిపథ్తో నాలుగేండ్ల తర్వాత తిరిగి వచ్చిన తర్వాత తమ బిడ్డలు ఏం చేయాలని యోల్ కంటోన్మెంట్ సమీపంలోని ధలూమ్కు చెందిన ట్యాక్సీ డ్రైవర్ సంజీవ్ కుమార్ ప్రశ్నించారు.