న్యూఢిల్లీ: ఒక మహిళ ఏకంగా పార్కులో ఆలయాన్ని నిర్మించింది. దీనిని వ్యతిరేకించి కూల్చివేయాలని ఫిర్యాదు చేసిన యువకుడ్ని (Youth Murder) కాంట్రాక్ట్ కిల్లర్స్తో హత్య చేయించింది. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. నరైనా పారిశ్రామిక ప్రాంతం ఫేజ్1లోని ఇందిరా గాంధీ క్యాంప్ పార్క్లో ఒక ఆలయాన్ని రేణు దేవి నిర్మించింది. ద్వారకా ప్రాంతానికి చెందిన కమల్ కుమార్, దీనిపై ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ) అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేశాడు. పార్కులో అక్రమంగా నిర్మించిన గుడిని కూల్చివేయాలని, రేణు దేవిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు. దీంతో కమల్ కుమార్ను హత్య చేసేందుకు రేణు దేవి ప్లాన్ చేసింది. దీని కోసం కాంట్రాక్ట్ కిల్లర్స్ను నియమించుకుంది. స్థానిక మార్కెట్లో చిన్న దాబా, మొబైల్ యాక్సెసరీస్ షాపు నడుపుతున్న 19 ఏళ్ల సచిన్, 24 ఏళ్ల సుమిత్, 24 ఏళ్ల భరత్, 20 ఏళ్ల రోహిత్తో డీల్ కుదుర్చుకుంది.
కాగా, మార్చి 30న ఒక వ్యక్తి గాయాలతో పడి ఉన్నట్లు నరైనా పోలీస్ స్టేషన్కు ఒక ఫోన్ కాల్ వచ్చింది. దీంతో పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. తీవ్ర గాయాలతో పడి ఉన్న కమల్ కుమార్ను డీడీయూ ఆసుపత్రికి తరలించారు. అయితే అతడు అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో పోలీసులు వెంటనే ఈ హత్యపై దర్యాప్తు చేపట్టారు. పోలీస్ బృందం ఒక తెల్లని కారును సంఘటనా స్థలంలో గుర్తించింది. ఆ కారుపై, పరిసర ప్రాంతంలో రక్తం మరకలు ఉండటాన్ని పరిశీలించారు.
మరోవైపు పార్క్లో ఆలయం నిర్మించిన రేణు దేవిపై హతుడు కమల్ కుమార్ ఎంసీడీ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు దర్యాప్తులో పోలీసులు తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆమెను ప్రశ్నించారు. తొలుత దర్యాప్తునకు ఆ మహిళ సహకరించలేదు. అయితే నిందితులు హిమాచల్ ప్రదేశ్కు పారిపోయినట్లు పోలీసులకు తెలిసింది. దీంతో ఒక పోలీస్ బృందం అక్కడకు వెళ్లింది. అయితే నిందితులు అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయారు.
కాగా, రేణు దేవిని పోలీసులు మరోసారి గట్టిగా ప్రశ్నించారు. దీంతో ఆమె నోరు విప్పింది. కాంట్రాక్ట్ కిల్లర్స్తో కమల్ను హత్య చేయించినట్లు ఒప్పుకుంది. ఈ నేపథ్యంలో ఆ మహిళతోపాటు ఈ నెల 1న సచిన్, సుమిత్, భరత్, రోహిత్ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. హత్యకు వినియోగించిన దేశీయ పిస్టల్, రెండు బుల్లెట్లు, నంబర్ ప్లేట్ లేని స్కూటీని వారి నుంచి స్వాధీనం చేసుకున్నారు. నిందితులు కారులో హిమాచల్ ప్రదేశ్కు పారిపోయేందుకు సహకరించిన ఉత్తర ప్రదేశ్లోని ఘజియాబాద్కు చెందిన సౌరభ్ త్యాగిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసుపై మరింతగా దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి వెల్లడించారు.
Also Read: