Rahul Gandhi : అయోధ్యలోని రామ మందిరంలో విరాళాలకు సంబంధించి అక్రమాలు, అవకతవకలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై తాజాగా కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. ఈ అంశంపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ ప్రధాని మోదీకి ఇద్దరూ కలిసి బహిరంగ లేఖ రాశారు. ఆదివారం రాసిన ఈ లేఖలో ఖర్గే, రాహుల్ కీలక అంశాల్ని ప్రస్తావించారు. రామాలయానికి సంబంధించి శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్కు సంబంధించిన ఆర్థిక వ్యవహారాలపై స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని లేఖలో డిమాండ్ చేశారు.
ఈ ట్రస్టుకు భక్తులు తమ కష్టార్జితాన్ని విరాళాలుగా అందిస్తే, ఈ ట్రస్టు మాత్రం వాటిని ఎత్తుకెళ్లి వారికి వెన్నుపోటు పొడిచిందని లేఖలో పేర్కొన్నారు. లక్షల మంది భక్తులు సమర్పించిన కానుకల మాయంపై మోదీకి అవగాహన ఉందని లేఖలో వివరించారు. ఎందరో తమ భక్తితో, విశ్వాసంతో, నమ్మకంతో కానుకలు సమర్పిస్తే వాటిని ఎత్తుకెళ్లారని విమర్శించారు. సుప్రీంకోర్టు సూచనలకు అనుగుణంగా ట్రస్టును ఏర్పాటు చేస్తామని పార్లమెంట్లో ప్రకటించి, తర్వాత నచ్చినవారిని సభ్యులుగా నియమించుకున్నారని మోదీకి గుర్తు చేశారు. ఈ ట్రస్టులో వీహెచ్పీ, ఆర్ఎస్ఎస్ సభ్యులే ఉన్నారని, జనరల్ సెక్రెటరీ మోదీకి అత్యంత సన్నిహితుడే అని లేఖలో పేర్కొన్నారు. ఇలాంటి నేరం జరిగినప్పటికీ మోదీ మౌనంగా ఉండటం అంగీకరించలేమని అన్నారు.
ఈ విషయంలో జవాబుదారీగా వ్యవహరించాలని, దీనిపై స్వతంత్ర, సమగ్ర విచారణ జరిపించాలని లేఖలో డిమాండ్ చేశారు. ట్రస్టుకు సంబంధించిన ఆర్థిక వ్యవహారాలను ప్రజలకు బయటపెట్టాలని కోరారు. ఈ అక్రమాలకు బాధ్యులైన అందరిపై చర్యలు తీసుకోవాలని, నిందితులు ఎలాంటిస్థాయిలో ఉన్నా వదిలిపెట్టవద్దని కోరారు. రామజన్మభూమి ఆలయంలోని అవకతవకలపై సీఎం యోగి ఆదిత్యనాథ్ విచారణ జరిపిస్తున్నారు. ఇందుకోసం ఒక సిట్ ఏర్పాటు చేశారు. ఈ సిట్ ప్రాథమిక నివేదిక సమర్పించింది. ఇంకా విచారణ కొనసాగుతోంది. పలువురిని అరెస్టు కూడా చేశారు.