లక్నో : యూపీలో రేషన్ అంతటినీ బీఎస్పీ ఏనుగు మింగేసిందని యూపీ సీఎం యోగి ఆదిత్యానాధ్ మాయావతి నేతృత్వంలోని బీఎస్పీపై విరుచుకుపడ్డారు. యూపీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సుల్తాన్పూర్లో శుక్రవారం జరిగిన ర్యాలీలో యోగి మాట్లాడుతూ మార్చి 10న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడగానే రాష్ట్రాన్ని విడిచిపెట్టి వెళ్లేందుకు విపక్ష నేతలు మార్చి 11న టికెట్లు బుక్ చేసుకున్నారని ఎద్దేవా చేశారు. బీఎస్పీ హయాంలో ఆ పార్టీ ఏనుగు కడుపు చాలా పెద్దదని దీంతో రాష్ట్రంలో రేషన్ మొత్తం వారే మింగేశారని దుయ్యబట్టారు.
అంతకుముందు యోగి ఆదిత్యానాధ్ అయోధ్యలో రామ మందిర నిర్మాణ పనులను పరిశీలించారు. రామాలయ నిర్మాణ పనులపై నిర్వాహకులను ఆరా తీసి పురోగతిని సమీక్షించారు. ఏడు దశల్లో యూపీ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా ఇప్పటికి నాలుగు దశల పోలింగ్ ముగిసింది. ఫిబ్రవరి 27న ఐదో దశ పోలింగ్ జరగనుంది. అయోధ్య, రాయ్ బరేలి, అమేధి జిల్లాలు సహా తూర్పు ప్రాంతంలో ఐదో దశ పోలింగ్ జరగనుంది. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం యోగి ఆదిత్యానాధ్ గోరఖ్పూర్ అర్బన్ నుంచి పోటీ చేస్తున్నారు. మరోవైపు బారాబంకీలో జరిగిన ర్యాలీలో యోగి ఆదిత్యానాధ్ ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్పై విరుచుకుపడ్డారు.
అల్లర్లను ప్రేరేపించే పార్టీ కావాలో..పేదల సంక్షేమానికి పాటుపడే పార్టీ కావాలో ప్రజలు నిర్ణయించుకోవాలని అన్నారు. ఇక ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకూ ఏడు దశల్లో యూపీ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా మార్చి 10న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి మళ్లీ పాలనా పగ్గాలు చేపట్టాలని పాలక బీజేపీ సర్వశక్తులు ఒడ్డుతుండగా, యోగి సర్కార్పై వ్యతిరేకతను సొమ్ము చేసుకుని అందలం ఎక్కాలని అఖిలేష్ యాదవ్ సారధ్యంలోని ఎస్పీ చెమటోడుస్తోంది. ఇక ప్రధాన పార్టీలకు దీటుగా సత్తా చాటాలని కాంగ్రెస్, బీఎస్పీలు పావులు కదుపుతున్నాయి.