లక్నో : యూపీ ముఖ్యమంత్రిగా రెండోసారి శుక్రవారం పాలనా పగ్గాలు చేపట్టనున్న యోగి ఆదిత్యానాధ్ను బీజేపీ శాసనసభాపక్ష నేతగా ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. యూపీ డిప్యూటీ సీఎంగా కేశవ్ ప్రసాద్ మౌర్య ఎంపిక కూడా లాంఛనప్రాయమేనని బీజేపీ వర్గాలు పేర్కొన్నాయి .
ఇటీవల జరిగిన యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో మౌర్య సిరాధు అసెంబ్లీ స్ధానం నుంచి పోటీ చేసి ఎస్పీ అభ్యర్ధి పల్లవి పటేల్ చేతిలో ఓటమి పాలయ్యారు. 2024 లోక్సభ ఎన్నికలకు కాషాయ పార్టీ సిద్ధమవుతున్న నేపధ్యంలో ఓబీసీ ఓటర్లలో గట్టిపట్టున్న మౌర్యకు మరోసారి డిప్యూటీ సీఎం పదవి కట్టబెట్టాలని బీజేపీ నిర్ణయించింది.
ఇక లక్నోలో ఎకనా స్టేడియంలో రేపు జురగనున్న యోగి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా, పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలతో పాటు బాలీవుడ్ దిగ్గజాలు అక్షయ్కుమార్, కంగనా రనౌత్, అజయ్ దేవ్గన్ కశ్మీర్ ఫైల్స్ చిత్ర బృందం వివేక్ అగ్నిహోత్రి, పల్లవి జోషి, అనుపమ్ ఖేర్ తదితరులు హాజరు కానున్నారు. ఈ కార్యక్రమానికి బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలిరానున్నాయి.