న్యూఢిల్లీ, సెప్టెంబర్ 13: తీవ్రమైన కరోనా లక్షణాలతో బాధపడేవారికి ఆయుర్వేదం, యోగా అద్భుతంగా పనిచేస్తాయని తాజా అధ్యయనంలో తేలింది. ఐఐటీ-ఢిల్లీ, దేవ్ సంస్కృతి విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు సంయుక్తంగా.. 30 మంది హైరిస్క్ బాధితులకు ఆయుర్వేద మందులు అందించి, నిత్యం యోగా చేయించటం ద్వారా మంచి లాభాలు రాబట్టారు. తీవ్ర లక్షణాలున్నవారిలో ఆందోళన ఎక్కువగా ఉంటుందని, వీరికి ఆయుర్వేద, యోగా భారీ ఉపశమనాన్ని కలిగించాయని ఐఐటీ-ఢిల్లీ శాస్త్రవేత్త రాహుల్ గార్గ్ వెల్లడించారు. తాము ఎంచుకొన్న బాధితుల్లో మధుమేహం, హైపర్టెన్షన్, కిడ్నీ వ్యాధులు ఉన్నట్టు తెలిపారు. వీరంతా సాధారణం కంటే వేగంగా వ్యాధి నుంచి కోలుకొన్నారని వివరించారు. దీనికి సంబంధించిన అధ్యయనం ఇండియన్ జర్నల్ ఆఫ్ ట్రెడిషనల్ నాలెడ్జ్లో ప్రచురితమైంది.
అత్యవసర ఔషధాలుగా క్యాన్సర్ మందులు
జాతీయ అత్యవసర ఔషధాల జాబితాను కేంద్రం సవరించింది. కొత్తగా 34 ఔషధాలను జాబితాలో చేర్చింది. 26 మందులను తొలగించింది. జాబితాలో చేరినవాటిలో ఐవర్మెక్టిన్, ముపిరోకిన్, క్యాన్సర్ నిరోధక ఔషధాలు తదితరాలు ఉన్నాయి. కీలకమైన ఈ మందులను జాబితాలో చేర్చడం వల్ల సరసమైన ధరలకే అందుబాటులోకి రానున్నాయి. తాజాగా చేరిన ఔషధాలతో మొత్తం సంఖ్య 384కు చేరింది. వీటిలో యాంటిబయాటిక్స్, వ్యాక్సిన్లు, క్యాన్సర్ నిరోధక మందులు తదితర 27 క్యాటగిరీలకు చెందిన ఔషధాలున్నాయి.