నాగార్జునసాగర్ ఉప ఎన్నికల వ్యయ పరిశీలకుడు విజయ్చౌదరి
నల్లగొండ, మార్చి 31 : నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో ఎన్నికల నిబంధనల ప్రకారం సిబ్బంది విధులు నిర్వహించాలని ఎన్నికల వ్యయ పరిశీలకుడు ఎస్హెచ్ విజయ్ చౌదరి ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని ఉదయాదిత్య భవన్లో కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, ఎస్పీ రంగనాథ్తోపాటు ఆయా ఎన్నికల బృందాలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అన్ని బృందాలు ఎన్నికల వ్యయ పరిశీలన చేసి ప్రతిరోజు నివేదికను సమర్పించాలని అన్నారు. ఉప ఎన్నికలో పోటీ చేస్తున్న అభ్యర్థులు ప్రత్యేకంగా బ్యాంకు ఖాతా తీసి రూ.10 వేలకు మించి నగదు లావాదేవీలు నిర్వహించరాదని పేర్కొన్నారు. ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియాతో పాటు సోషల్ మీడియాలో ప్రకటనలు, ప్రసారాలకు సంబంధించి మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ అనుమతి తీసుకోవాలని అన్నారు. రాజకీయ పార్టీల సమావేశాలకు సంబంధించి వీడియో సర్వేలైన్స్, టీమ్ వీడియోగ్రఫీ చేసి రికార్డులను పరిశీలించాలని సూచించారు. డబ్బు, మద్యం పంపిణీపై గట్టి నిఘా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ మాట్లాడుతూ ఇప్పటికే సమావేశాలు ఏర్పాటు చేసి సిబ్బందికి చెప్పామని, క్షేత్రస్థాయిలో చురుగ్గా పని చేయాలని అన్నారు. ఎస్పీ రంగనాథ్ మాట్లాడుతూ ఉప ఎన్నిక ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. సమావేశంలో అదనపు ఎస్పీ నర్మద, మిర్యాలగూడ, దేవరకొండ డీఎస్పీలు వెంకటేశ్వర్రావు, ఆనంద్రెడ్డి, శిక్షణ నోడల్ అధికారి రాజ్కుమార్, డీపీఆర్వో శ్రీనివాస్, ఎన్నికల వ్యయ సహాయ అధికారి సురేశ్ పాల్గొన్నారు.
సెక్టార్ అధికారుల పాత్రే కీలకం..
–కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్
ఉప ఎన్నిక నిర్వహణలో సెక్టార్ అధికారుల పాత్ర కీలకమని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అన్నారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో బుధవారం సెక్టార్ అధికారులకు శిక్షణ ఇచ్చారు. సెక్టార్ అధికారులు రిటర్నింగ్ అధికారుల పరిధిలో విధులు నిర్వహించాలని అన్నారు. ఒక్కో సెక్టార్ అధికారికి 10 నుంచి 12 పోలింగ్ కేంద్రాల బాధ్యత అప్పగించడంతోపాటు రూట్ అధికారిని కూడా కేటాయిస్తామని తెలిపారు. పోలింగ్ కేంద్రాలను సందర్శించి నివేదించాలని సూచించారు. సామగ్రిని తరలించేందుకు రూట్ మ్యాప్ సిద్ధం చేసుకోవాలని అన్నారు. నామినేషన్ల ఉపసంహరణ అనంతరం ఈవీఎం బ్యాలెట్ పత్రాల ముద్రణ పూర్తి అయిన వెంటనే పోలింగ్కు సిద్ధం కావాలని సూచించారు. పోలింగ్ రోజు ప్రతి రెండు గంటలకు పోలింగ్ శాతాన్ని రిటర్నింగ్ అధికారికి తెలియజేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో డీఆర్వో జగదీశ్వర్రెడ్డి, శిక్షణ నోడల్ అధికారి రాజ్కుమార్, మాస్టర్ ట్రైనర్లు తరాల పరమేశ్, రమేశ్, గోపాల్రెడ్డి, సోమయ్య, జానారెడ్డి పాల్గొన్నారు.